ఐఎన్ఎక్స్ మీడియా కేస్ అప్డేట్స్: బెయిల్ కోసం సుప్రీం తలపులు తట్టిన చిదంబరం
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరం బెయిల్ కోసం సుప్రీం తలపులను తట్టారు. బెయిల్ పై వాదనలు త్వరగా వినాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. చిదంబరం తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కపిల్ సిబల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ ఎన్వీ రమణ విచారణ చేశారు.
ఇంటి భోజనం తినాలనిపిస్తోంది: అనుమతి ఇవ్వాలంటూ చిదంబరం పిటీషన్
చిదంబరం బెయిల్ పిటిషన్ను దసరా సెలవులు ప్రారంభం అయ్యేలోగా విచారణ చేయాలని కపిల్ సిబాల్ కోరారు. సోమవారం నుంచి సుప్రీం కోర్టుకు వారం రోజుల పాటు దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో అంతకంటే ముందే వాదనలు వినాలని కపిల్ సిబాల్ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు. అయితే అత్యవసరంగా వాదనలు వినాలని చిదంబరం కోర్టుకు పెట్టుకున్న విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నిర్ణయిస్తారని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పినట్లు సమాచారం.
కొద్ది రోజుల క్రితం బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... కోర్టు చిదంబరం బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. బెయిల్ పై చిదంబరం బయటకు వస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని అదే సమయంలో సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. సీబీఐ వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించి చిదంబరంకు బెయిల్ తిరస్కరించింది. అయితే దేశం కూడా దాటి వెళ్లే అవకాశం ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకురాగా.. కోర్టు ఈ విషయంలో సీబీఐని తప్పుబట్టింది. ఇప్పుడప్పుడే చిదంబరంను ప్రశ్నించబోమని చెప్పిన ఈడీ విషయంను కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు చిదంబరం తరపున లాయర్లు.
బెయిల్ వచ్చిన తర్వాత చిదంబరంను తిరిగి అరెస్టు చేసే యోచనలో ఈడీ పావులు కదుపుతోందని కపిల్ సిబాల్ చెప్పారు. అరెస్టు చేసి తిరిగి తీహార్ జైలుకు పంపాలనే కుట్ర ఈడీ చేస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే 2007లో 305 కోట్లు మేరా ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఆ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని చిదంబరం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని సీబీఐ కేసు నమోదు చేసింది.