అవినీతి ఆరోపణలున్న టికెట్ ? కొడుకు కోసం చిదంబరం లాబీయింగ్ : డిపాజిట్ దక్కదన్న సుదర్శన
న్యూఢిల్లీ : కాంగ్రెస్లో సీట్ల కుంపటి అగ్గిరాజేసింది. కొన్నిచోట్ల సిట్టింగులను కాదని టికెట్లు ఇవ్వడంతో వారు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తమిళనాడులోని శివగంగ నియోజకవర్గానికి చిదంబరం తనయడు కార్తీకి ఇవ్వడంపై మాజీ ఎంపీ సుదర్శన నాచిప్పన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి ఆరోపణలు ఉన్న కార్తీకి టికెట్ ఎలా ఇస్తారని కాంగ్రెస్ హైకమాండ్ను ప్రశ్నించారు.
అలా ఏలా ?
శివగంగ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కార్తీకి ఏ ప్రాతిపదికన ఇచ్చారని ప్రశ్నించారు సుదర్శన. చిదంబరం ప్రోద్బలంతోనే అవినీతికి పరాకాష్ట అయిన కార్తీ లాంటి నేతలకు టికెట్ దక్కుతోందని, తమలాంటి వారిని పక్కనపెడుతున్నారని ఆవేదన చెందారాయన. దీనిపై ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి, నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇదీ మరో కారణం ?
తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అలగిరి చిదంబరం కోటరి వ్యక్తిని, టికెట్ కేటాయింపులో తన పేరు లేకపోవడం మరో కారణమై ఉంటుందని అనుమానం వ్యక్తంచేశారు. తన కొడుకుకు టికెట్ ఇప్పించుకునేందుకు చిదంబరం రాజకీయం చేశాడని ఆరోపించారు. దీంతో అవినీతిపరుడైన కార్తీకి టికెట్ దక్కిందని పేర్కొన్నారు. కార్తీని పోటీచేయొద్దని కోర్టు స్పష్టం చేస్తే, తన కోడలు శ్రీనిధిని బరిలోకి దించేందుకు యోచిస్తారని అనుమానం వ్యక్తచేశారు.
పార్టీకి డ్యామేజీ ?
దేశంలో అవినీతిని రూపుమాపుతాం, అంతమొందిస్తామని రాహుల్ గాంధీ ప్రచారం చేస్తుంటే, మరోవైపు చిదంబరం అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నీతిలేని తన కుమారుడికి టికెట్ ఇప్పించడమే చిదంబరం చేసిన తప్పని, దీంతో కాంగ్రెస్ పార్టీకి నష్టమే జరుగుతుందన్నారు. తమిళనాడులో చిదంబరం కుటుంబాన్ని ప్రజలు అసహ్యయించుకుంటున్నారని పేర్కొన్నారు.
మెజారిటీ నుంచి మైనారిటీ
2004లో తన నియోజకవర్గాన్ని చిదంబరానికి వదిలేశానని గుర్తుచేశారాయన. ఆ ఎన్నికల్లో లక్షా యాభైవేల మెజార్టీలో గెలువాల్సిన చిదంబరం, కొద్ది ఓట్ల తేడాతో బయటపడ్డారని పేర్కొన్నారు. 2009లో కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారని ... తర్వాత 2014లో డిపాజిట్ కోల్పోయారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కార్తీని నిలబెట్టి మరోసారి ఘోరంగా పరాజయం పాలవుతారని అంచనా వేశారు.