20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ బ్లాంక్ పేజీ, మోడీ ఆర్థిక ఉద్దీపనపై చిదంబరం సెటైర్లు..
కరోనా వైరస్ వల్ల దెబ్బతిన్న పరిశ్రమలు, రాష్ట్రాలను ఆదుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం స్పందించారు. మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో హెడ్ లైన్ కనిపిస్తూ.. మిగతా బ్లాంక్ పేజీ (ఖాళీ)గా కనిపిస్తోందని విమర్శించారు.
ఆర్థిక వ్యవస్థలోకి వచ్చే ప్రతీ రూపాయి.. పేదల ఆకలిని తీర్చేలా ఉండాలని చిదంబరం అభిప్రాయపడ్డారు. చేతిలో పని లేక వందలాది కిలోమీటర్లు నడిచి వెళ్తోన్న పేదల ప్రయోజనాల కోసం పాటుపడాలని కోరారు. ఆర్థిక ప్యాకేజీతో ఎవరికీ మేలు జరుగుతుందో చూడాలన్నారు. ప్రధాని హెడ్ లైన్లో ఖాళీగా ఉంచడంతో... దానిని తాను కూడా బ్లాంక్గా ఉంచుతున్నానని పేర్కొన్నారు.
లాక్ డౌన్ వల్ల దాదాపు 13 కోట్ల కుటుంబాలు తినడానికి తిండిలేని స్థితిలో ఉన్నాయని చెప్పారు. వారికి ప్రభుత్వం ఏ విధంగా సాయం చేస్తుందో చూడాలన్నారు. మరో కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ కూడా ప్రధాని ఆర్థికసాయంపై పెదవి విరిచారు. గరిష్ట ప్యాకేజీ, మినిమం మినింగ్ అర్థం వచ్చేలా క్లాసిక్ 'నమో' ఉందని.. ఇందులో యాక్షన్కు తావులేదని ట్వీట్ చేశారు.