చిదంబరం సమాధానం చెప్పాలి: స్టెరిలైట్ ఇష్యూపై స్వామి, బాధితుల వద్దకు కమల్
తుత్తుకూడి: స్టెరిలైట్ ఘటనపై చిదంబరం సమాధానం చెప్పాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. ఈ కంపెనీలో చాలా ఏళ్ల పాటు పెయిడ్ డైరెక్టర్గా చిదంబరం కొనసాగారని ఆరోపించారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా ఆయన నోరు విప్పాలన్నారు.
కాలుష్యం వెదజల్లుతున్న స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసేయాలని చేపట్టిన ఆందోళన తమిళనాడులో హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పోలీసులు జరిపిన కాల్పుల్లో, చికిత్స పొందుతూ 11 మంది మృతి చెందారు. చాలామందికి గాయాలయ్యాయి.
విషయం తెలియగానే ముఖ్యమంత్రి పళనిస్వామి సంఘటనపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. 2013లో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఈ స్టెరిలైట్ కర్మాగారం మూసివేతకు తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామన్నారు.
P Chidambaram should answer on #SterliteProtest incident, he was a paid director in the company for many years.All documents are available.He should now speak up on behalf of #Sterlite: Subramanian Swamy,BJP MP pic.twitter.com/VNehlX8UVF
— ANI (@ANI) May 23, 2018
బుధవారం కర్మాగారానికి వ్యతిరేకంగా ఇరవై గ్రామాల నుంచి సుమారు ఇరవై వేలమంది ఆందోళనకారులు మంగళవారం ట్యుటికోరిన్లో సమావేశమయ్యారు. ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరారు. అక్కడి నుంచి కర్మాగారానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. కర్మాగారం చుట్టుపక్కల ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టకూడదని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు గుమికూడవద్దని కలెక్టర్ 144వ సెక్షన్ విధించారు.
ఈ ఆదేశాలు పక్కన పెడుతూ ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేశారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసుల వాహనం దగ్ధం చేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులు, పాత్రికేయులు గాయపడ్డారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయారు.
Tamil Nadu: Makkal Needhi Maiam chief Kamal Haasan arrives at General Hospital in #Thoothukudi to meet people who were injured in #SterliteProtest yesterday pic.twitter.com/NBpUfXU9pd
— ANI (@ANI) May 23, 2018
తుత్తుకూడికి కమల్ హాసన్
తుత్తుకూడిలో స్టెరిలైట్ ఘటన నేపథ్యంలో ప్రముఖ నటుడు మక్కల్ నీధి మైయమ్ అధినేత కమల్ హాసన్ బాధితులను పరామర్శించేందుకు బుధవారం ఆసుపత్రికి వచ్చారు. తుత్తుకూడి ఘటనపై రజనీకాంత్, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.