యుద్ధం గురించి నేతలు.. ఉద్యమాల గురించి ఆర్మీ.. మాట్లాడకుంటే మంచిది
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడటం కరెక్ట్ కాదని, ఆయన ప్రభుత్వ ఏజెంట్ లాగా వ్యవహరించడం సిగ్గుచేటని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం అన్నారు. కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆర్మీ చీఫ్ తీరును తప్పుపట్టారు.
పౌరసత్వ సవరణ చట్టం ఎఫెక్ట్ : ముస్లిం కుటుంబాలకు పోలీసుల వేధింపులు
అనవసర జోక్యం వద్దు..
‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల డీజీపీలతోపాటు ఆర్మీ చీఫ్ రావత్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉంది. రావత్ పని ఆర్మీని నడిపించడం వరకేగానీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కాదు. యుద్ధం ఎలా చెయ్యాలో సైన్యానికి మేం(నేతలు) చెబితే అస్సలు బాగోదు. అలాగే, ప్రజా ఉద్యమాలు, నాయకత్వం గురించి ఆర్మీ చీఫ్ మాట్లాడొద్దు. అనవసర జోక్యం మంచిదికాదు''అని చిదంబరం అన్నారు.
కాంగ్రెస్ హయాంలో డిటెన్షన్ సెంటర్లపై..
ఎన్ఆర్సీపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో అసలా చట్టాలను రూపొందించిందే కాంగ్రెస్ పార్టీ అని, చిదంబరం హోం మంత్రిగా ఉన్నప్పుడే డిటెన్షన్ సెంటర్లను నిర్మించారని బీజేపీ ఎదురుదాడి చేసింది. దీనిపై స్పందించిన చిదంబరం.. కాంగ్రెస్ జమానాలోనూ డిటెన్షన్ సెంటర్లు ఏర్పాటైన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే తాము ఫారినర్స్ యాక్ట్ ను అనుసరించి వాటిని ఏర్పాటు చేశామని, ప్రస్తుత బీజేపీ మాత్రం సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను అనుసరించి డిటెన్షన్ సెంటర్లను ఏర్పాటుచేయాలనుకుంటున్నదని, అందుకే వాటిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
19 లక్షల మందిని ఎక్కడికి పంపుతారు?
తిరువనంతపురంలో ‘సేవ్ ఇండియా.. సేవ్ కానిస్టిట్యూషన్' ర్యాలీలో మాట్లాడుతూ ఎన్ఆర్సీపై చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో ఎన్ఆర్సీ ద్వారా 19 లక్షల మందిని అక్రమవలసదారులుగా గుర్తించారని, మరిప్పుడు వాళ్లందరినీఎక్కడికి తరలిస్తారో? వాళ్లను ఏ దేశం స్వీకరిస్తుందో తెలియని అయోమయపరిస్థితి నెలకొందని చిదంబరం అన్నారు.