జార్ఖండ్ ఫలితాలపై చిదంబరం ట్వీట్: కమలం కథ ముగిసిందంటూ సెటైర్లు
న్యూఢిల్లీ: జార్ఖండ్లో ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా రావడంతో ఇక ఆ రాష్ట్రాన్ని కూడా కోల్పోయినట్లయ్యింది. మొత్తంగా 2019లో జరిగిన ఆయా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 5 రాష్ట్రాలను కోల్పోయింది. తాజాగా జార్ఖండ్లో కూడా ఆ పార్టీకి స్ట్రోక్ తగలడంతో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ అది వెంటిలేటర్పైనే ఉందని, మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో పార్టీ ప్రదర్శనేంటో బయలుపడిందని చిదంబంరం ఎద్దేవా చేశారు.
హర్యానాలో బీజేపీకి చావుతప్పి కన్నులొట్టబోయిందని, మహారాష్ట్రలో ప్రజలు తిరస్కరించారని, జార్ఖండ్లో ఓటమిపాలైందంటూ చిదంబరం సెటైర్లు వేశారు. 2019లో బీజేపీ స్టోరీ ఇది అంటూ ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీయేతర రాష్ట్రాలు కలిసి కాంగ్రెస్తో రావాలని ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు.
జార్ఖండ్లో కాంగ్రెస్- జేఎంఎం-ఆర్జేడీ కూటమి 49 స్థానాల్లో విజయం సాధించింది. పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ... ఆయా రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో మాత్రం మంచి ఫలితాలను రాబట్టలేక పోయింది. మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ మంచి ప్రదర్శన కనబరుస్తుందని అంతా భావించినప్పటికీ ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. మహారాష్ట్రలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ శివసేనలు కలిసి పోటీచేయగా 53శాతం ఓట్లు వచ్చాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ రెండు పార్టీలు కలిపి పోటీచేయగా 45శాతం ఓట్లు వచ్చాయి. దీంతో 2014లో బీజేపీకి 122 స్థానాలు ఉండగా 2019కి 105 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇక ఆ తర్వాత బీజేపీ అధికారంకు దూరమైంది. బీజేపీకి గుడ్బై చెప్పి బయటకు వచ్చేసిన శివసేన మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Dented in Haryana,
— P. Chidambaram (@PChidambaram_IN) December 23, 2019
Denied in Maharashtra,
Defeated in Jharkhand.
That is the story of the BJP in 2019.
All non-BJP parties must raise their sights and rally around the Congress to save the Constitution of India.
హర్యానాలో కూడా బీజేపీ 10 లోక్సభ స్థానాలు గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసింది. 58శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి 36శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక తప్పని పరిస్థితుల్లో ఇతర పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే జేజేపీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దుష్యంత్ చౌతాలకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసింది.