చిదంబరం అరెస్ట్.. ... రాత్రంతా కస్టడీలోనే...సీబీఐ ఆఫీస్లో వైద్యపరీక్షలు, గురువారం సీబీఐ కోర్టుకు..
24 గంటల హైడ్రామాకు తెరపడింది. మంగళవారం రాత్రి నుండి మాజీ కేంద్రమంత్రి పీ. చిదంబరం అరెస్ట్ కోసం వేచి ఉన్న సీబీఐ అధికారులు ఎట్టకేలకు బుధవారం రాత్రి డిల్లీలోని ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో మంగళవారం నాడు ముందస్తు బెయిల్పై న్యాయస్థానాల్లో చుక్కెదురైన తర్వాత చిదంబరం కనబడకుండా పోయాడు. కాగా 24 గంటల తర్వాత అకస్మాత్తుగా రాత్రీ 8 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. అనంతరం ఇంటికి వెళ్లిన చిదంబరాన్ని అనేక హైడ్రామా మధ్య అరెస్ట్ చేశారు.
మంగళవారం రాత్రీ ఇంట్లోలేని చిదంబరం
ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో డిల్లీ హై కోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేసిన తర్వాత చిదంబరం సుప్రిం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే సుప్రిం కోర్టులో సైతం ఆయనకు చుక్కెదురు అయింది. దీంతో రంగంలోకి దిగిన సిబిఐ, ఈడీ అధికారులు హడావిడి చేశారు. దీంతో ఆయన అరెస్ట్కు రంగం సిద్దం చేశారు. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకునేందుకు ఇంటికి వెళ్లిన అధికారులకు చుక్కెదురైంది. ఆయన ఇంట్లో లేకపోవడంతో ,అర్ధరాత్రీ వరకు సీబీఐ ముందు హజరుకావాలని నోటీసులు అంటించారు.
24 గంటల తర్వాత ఏఐసీసీ కార్యాయంలో ప్రత్యక్షమైన చిదంబరం
ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించిన తర్వాత గత 24 గంటలుగా కనిపించకుండా పోయిన చిదంబరం అకస్మాత్తుగా ఏఐసీసీ కార్యాలయాంలో ప్రత్యక్షమయ్యారు.సుమారు 30 నిమిషాలపాటు పార్టీ కార్యాలయంలో ఉన్నాడు. అనంతరం కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించాడు. పదిహేను నిమిషాల పాటు ముందే ప్రిపేర్ చేసుకున్న విషయాన్ని మీడీయాకు వివరించాడు. దీంతో విషయాన్ని తెలుసుకున్న సీబీఐ,ఈడీ అధికారులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే పార్టీ కార్యకర్తలు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే ప్రెస్ మీట్ నిర్వహించిన వెంటనే ఆయన తిరిగి ఇంటికి వెళ్లాడు.
చిదంబరాన్ని వెంటాడి,గోడ దూకి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ
ఇక ఇంటికి చేరుకున్న చిదంబరాన్ని సీబీఐ అధికారులు వెంటనే ఆయన ఇంటికి వెళ్లారు. అయితే చిదంబరం ఇంటికి వెళ్లిన అధికారులను స్థానిక సిబ్బంది లోపలికి అనుమతించ లేదు. దీంతో కొద్ది నిమిషాల పాటు వారు ఇంటిగేటు వద్దే ఉన్నారు.ఈలోగా ఈడీ అధికారులు సైతం ఆయన ఇంటికి చేరుకున్నారు. రెండు దర్యాప్తు బృందాల అధికారులు గోడదూకి ఇంటిలోపలికి వెళ్లారు. అయితే సుమారు గంటపాటు చిదంబరం వారిని కలిసేందుకు నిరాకరించాడు.దీంతో ఆయన్ను అరెస్ట్ చేసే వరకు కదిలేది లేదన్నట్టుగా సిబిఐ అధికారులు వ్యవహరించారు....అయితే సీబీఐతో పాటు చిదంబరం ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు మాత్రం వెనక్కి మళ్లారు..కాని సిబిఐ మాత్రం ఇంటి అవరణలోనే వేచి ఉండి ఆయనతో మాట్లాడిన తర్వాత అదుపులోకి తీసుకుంది. ఇక అంతకుముందు పలువురు కార్యకర్తలు చిదంబరం అరెస్ట్ కాకుండా ఆందోళన నిర్వహించారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాత్రంతా సీబీఐ కస్టడీలోనే...గురువారం సీబీఐ కోర్టుకు
ఇంటివద్ద కస్టడీలోకి తీసుకున్న అధికారులు నేరుగా సీబీఐ కేంద్ర కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం కార్యాలయంలోనే ఆయన రాంమనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులతో వైద్య చికిత్సలు చేయించారు. అన్ని పరీక్షల అనంతరం చిదంబరం అరెస్ట్ను సీబీఐ అధికారులు అధికారికంగా ధృవికరించారు. కాగా అరెస్ట్ అనంతరం రాత్రంతా సీబీఐ కేంద్రకార్యాలయంలోనే ఉంచనున్నారు. వీలైనంత వరకు ఆయన్ను విచారించన్న సీబీఐ, గురువారం సీబీఐ కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు.
దర్యాప్తు సంస్థలు చట్టాన్ని గౌరవించాలి..
కాగా అంతకుముందు ఏఐసీసీ కార్యాయంలో మాట్లాడిన చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు సంబంధం లేదన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, చార్జీషీట్లో తనపేరు లేదని పేర్కొన్నారు. ముడుపులకు సంబంధించి ఆరోపణలు లేవని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఘటనలో తనను ఇరికించడం ఏంటీ అని ప్రశ్నించారు. ఈ కేసులో తనకు నోటీసులు ఇవ్వడంపై నిన్నటి నుంచి తన లాయర్లతో సంప్రదింపులు జరిపానని పేర్కొన్నారు. తానేం తప్పుచేయలేదని .. ఎవరికీ భయపడబోనని తేల్చిచెప్పారు. ఓ పౌరుడిగా తిరిగే అధికారం తనకు ఉందని వివరించారు. చట్టాన్ని గౌరవిస్తానని .. దర్యాప్తు సంస్థలు కూడా చట్టాన్ని గౌరవించాలని కోరారు.