శశికళకు చిర్రెత్తుతోంది: పార్టీ నేతలు ఎందుకలా?, జనరల్ సెక్రటరీ పోస్టు ఉంటుందా?
బీఫారం అందజేయడానికి రోజులు దగ్గరపడుతుండటంతో ఈ నెల 20న శశికళ ప్రధాన కార్యదర్శి పదవిపై తీర్పు వెలువరించాలని సీఈసీ భావిస్తోంది.
బెంగుళూరు: అమ్మ మృతి తర్వాత చిన్నమ్మ నామస్మరణలో తరించిన అన్నాడీఎంకె నేతలు.. క్రమక్రమంగా ఆమె విషయాన్ని పట్టించుకోవడమే మరిచిపోతున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకె నేతల వైఖరి కూడా ఇందుకు ఊతమిస్తోంది.
శశికళ జైలుకు వెళ్లిన తొలి రోజుల్లో తరుచూ అక్కడికెళ్లి ఆమెను పరామర్శించిన నేతలు ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. క్రమంగా కార్యకర్తలు, నేతల రాకపోకలు తగ్గిపోవడంతో జైల్లో శశికళ సైతం పార్టీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం.
పళనిస్వామి ఇంతరకు వెళ్లలేదు:
సీఎంగా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఇంతవరకు ఆయన చిన్నమ్మను కలిసిన దాఖలా లేదు. తొలుత చిన్నమ్మను కలవడానికి ఆయన సిద్దపడినప్పటికీ.. ఇప్పుడే తనవద్దకు రావద్దని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ ద్వారా ఆమె కబురు పంపించారు.
చిన్నమ్మ కబురుతో తన ఆలోచన విరమించుకున్న పళనిస్వామి.. ఇక అప్పటినుంచి ఆ విషయమే మరిచిపోయారు. ఆయన ఒక్కరే కాదు మంత్రులు, నేతలు సైతం శశికళ జైల్లో ఉన్నారన్న విషయం మరిచిపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏరి కోరి అనుయాయిని సీఎం చేస్తే:
జయలలిత మరణం తర్వాత నెలకొన్న నాటకీయ పరిణామాలను ధీటుగా ఎదుర్కొన్న అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ.. పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో సఫలమయ్యారు.
ఇదే క్రమంలో పన్నీర్ సెల్వం వర్గానికి చెక్ పెట్టడానికి ఏరి కోరి మరీ తన అనుయాయి పళనిస్వామిని సీఎం చేశారు. తీరా ఇప్పుడాయన చిన్నమ్మ విషయమే మరిచిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు కలిసిన నేతలు:
విద్యాశాఖ మంత్రి సెంగొట్టయ్యన్ సహా దిండుగల్లు శ్రీనివాసన్, సెల్లూరు రాజా, ఆర్ కామరాజ్ తదితర మంత్రులు, పార్టీ నేతలు ఇప్పటివరకు చిన్నమ్మను పరామర్శించిన వారిలో ఉన్నారు. మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, ఏఐఏడీఎంకే నేతలు సరస్వతి, అన్నాడీఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ కూడా శశికళను కలిశారు.
ప్రధాన కార్యదర్శిగా శశికళ భవితవ్వం తేలనుంది:
అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ భవిష్యత్తు ఏంటనే దానిపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 20న ప్రధాన ఎన్నికల కమిషన్(సీఈసీ) తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం సీఈసీకి లేఖ రాయడంతో దీనిపై పంచాయితీ నెలకొంది. ఐదేళ్ల పాటు నిరంతరాయంగా సభ్యత్వం లేని శశికళకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టడమేంటని, ఆమె ఇందుకు అనర్హురాలని పన్నీర్ తరుపు వర్గం సీఈసీకి ఫిర్యాదు చేసింది.
దీనిపై సీఈసీ ఆదేశాల మేరకు శశికళ వివరణ ఇస్తూ వచ్చారు. ఇలా సీఈసీ కేంద్రంగా పన్నీర్-శశికళ వర్గాల మధ్య ఉత్తరాల ద్వారా వాదనలు జరుగుతూ వస్తున్నాయి.
ఆర్కేనగర్ 'బై పోల్' నేపథ్యంలో:
ఏప్రిల్ 12న ఆర్కేనగర్ బై పోల్ ఉండటంతో.. ఈ నెల 24వ తేదీలోగా పార్టీలు తమ అభ్యర్థులకు బీఫారం అందజేయాల్సి ఉంటుంది. బీఫారం అందజేసినవారికి ఎన్నికల కమిషన్ ఎన్నికల చిహ్నాం కేటాయిస్తుంది. బీఫారం అందజేయడానికి రోజులు దగ్గరపడుతుండటంతో ఈ నెల 20న శశికళ ప్రధాన కార్యదర్శి పదవిపై తీర్పు వెలువరించాలని సీఈసీ భావిస్తోంది.