పదవి విరమణ పొందిన రంజన్ గొగొయ్, నూతన సీజేఐగా బోబ్డే
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఆదివారం పదవి విరమణ చేశారు. శుక్రవారం తన చివరి పనిదినాన్ని ముగించుకున్న ఆయన నేడు బాధ్యతల నుండి తప్పుకున్నారు. 2018 అక్టోబర్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన 13 నెలల పాటు సీజేఐగా కొనసాగారు. కాగా ఈశాన్య రాష్ట్రాల నుండి మొదటి సారిగా ప్రధాని న్యాయమూర్తిగా ఎన్నికైన వ్యక్తిగా రంజన్ గొగొయ్ రికార్డు సాధించారు.
విరమణకు ముందు శ్రీవారిని దర్శించుకున్న గొగొయ్
ఆయన చివరి పని దినాన్ని శుక్రవారమే ముగించుకున్న రంజన్గొగొయ్ శనివారం సాయంత్రం శ్రీవారిని దర్శించుకునేందుకు కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకున్నారు. అనంతరం గొగొయ్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా ఆయన శనివారం తిరుమలలోనే బస చేసి ఆదివారం ఉదయం కూడ మరోసారీ శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించుకొని ఢిల్లీ వెళ్లారు.
సంచలన తీర్పులు వెలువరించిన రంజన్ గొగొయ్
గతేడాది అక్టోబర్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ గొగోయ్.. ఆ పదవిని చేపట్టిన తొలి ఈశాన్య భారతీయుడిగా రికార్డులకెక్కారు. ఈనేపథ్యంలో చారిత్రాత్మకమైన తీర్పులు సైతం వెలువరించిన ఘనతను దక్కించుకున్నారు. ముఖ్యంగా ఇటివల వెలువరించిన అయోధ్య వివాదం, శబరిమలై ఆలయ ప్రవేశం తోపాటు రఫెల్ తీర్పు తోపాటు సుప్రీం కోర్టు ప్రధాన కార్యాలయాన్ని కూడ ఆర్టీఐ పరిధిలోకి తీసుకువచ్చే సంచనల తీర్పులు ఆయన సారధ్యంలోనే వెలువడ్డాయి.
మీ టు ఆరోపణలు ఎదుర్కోన్న రంజన్గొగొయ్
అయితే తన పదవి కాలంలో సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు రంజన్ గొగొయ్ పై లైంగిక ఆరోపణలు చేసింది. దీంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆయన పై వచ్చిన ఆరోపణలపై కోర్టులోని బార్ కౌన్సిల్ సభ్యులు రెండు వర్గాలు విడిపోయారు. అయితే కేసు విచారణకు సంబంధించి ఆయన తప్పుకుని సంచలన సృష్టించారు. కాగా ఉద్యోగిని ఆరోపణలపై ధర్మాసనం రంజన్ గొగొయ్కు క్లీన్చిట్ ఇచ్చింది.
నూతన సీజేఐగా బోబ్డే...
రంజన్ గొగొయ్ వారసుడిగా 47వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ బోబ్డేను నియమించారు. ఇందుకోసం కోద్ది రోజుల క్రితమే రాష్ట్రపతి ఉత్తర్వులు కూడ జారీ చేశారు. నూతన సీజేగా మహారాష్ట్రకు చెందిన బోబ్దే సోమవారం భాద్యతలు చేపట్టనున్నారు. కాగా సుమారు 17 నెలల పాటు అనగా నవంబర్ 18 2019 నుండి 2021 ఏప్రిల్ 23 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. అయితే పలు కీలక కేసుల్లో బోబ్డే కూడ సభ్యుడుగా ఉండగా ముఖ్యంగా అయోధ్య వివాదంలో తీర్పువెలువరించిన అయిదుగురు న్యాయమూర్తుల్లో బోబ్డే ఒకరు.