దేశ చరిత్రలోనే ప్రథమం.. సిట్టింగ్ జడ్జి అవినీతిపై విచారణకు అనుమతించిన సీజేఐ..
ఢిల్లీ : చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ఎన్ శుక్లా అవినీతిపై విచారణకు సీబీఐకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్టింగ్ జడ్జిపై అవినీతి కేసు విచారణకు అనుమతిస్తూ సీజేఐ నిర్ణయం తీసుకోవడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి.
సీజేఐకు సీబీఐ లేఖ
2017 -18 మెడికల్ అడ్మిషన్ విషయంలో ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీకి లబ్ది చేకూర్చారంటూ అలహాబాద్ హోకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎన్ శుక్లాపై ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం ఆయన భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేకుండా జస్టిస్ శుక్లా ఉత్తర్వులు జారీ చేయడంపై సీబీఐకి ఫిర్యాదు అందింది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తి అనుమతిలేకుండా హైకోర్టు జడ్జిపై విచారణ జరిపే అవకాశం లేదు. దీంతో జస్టిస్ శుక్లాను విచారించి కేసు నమోదుచేసేందుకు అనుమతివ్వాలంటూ సీబీఐ సీజేఐకి లేఖ రాసింది.
అభిశంసించాలన్న ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ శుక్ల అవినీతిపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్యానెల్ గతంలోనే విచారణ జరిపింది. ఆయనను దోషిగా తేల్చింది. ఈ క్రమంలో జస్టిస్ శుక్లా రాజీనామా చేయాలని, లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆదేశించారు. అయితే అందుకు అంగీకరించని శుక్లా.. 2018లో తన తీర్పును ఉపసంహరించుకున్నారు. పదవి నుంచి వైదొలగకపోవడంతో జస్టిస్ శుక్లాను పార్లమెంటు తీర్మానం ద్వారా అభిశంసించాలని సీజేఐ రంజన్ గొగోయ్ గత నెలలో ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. తాజాగా జస్టిస్ శుక్లాపై విచారణకు సీబీఐకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మెడికల్ కాలేజీకి లబ్ది చేకూరేలా తీర్పు
2017 -18 విద్యా సంవత్సరంలో లక్నోకి చెందిన జీసీఆర్జీ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లను ప్రభుత్వం నిషేధించింది. సదరు కాలేజీ ప్రమాణాలు పాటించడం లేదంటూ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై మెడికల్ కాలేజ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన జస్టిస్ శుక్లా అడ్మిషన్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ శుక్లా ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. జస్టిస్ శుక్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ కోసం ముగ్గురు న్యాయమూర్తులతో ప్యానెల్ ఏర్పాటు చేసింది. అవినీతికి సంబంధించి తగిన ఆధారాలు ఉండటంతో ఆయన పదవి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని మంటగలిపారని అభిప్రాయపడుతూ ప్యానెల్ నివేదిక ఇచ్చింది.