ఆల్ ది బెస్ట్ సర్: సుప్రీంకోర్టులో చివరి రోజు గడిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవీవిరమణ చేయనున్నారు. ఈ క్రమంలోనే గత రెండువారాలుగా ఆయన చాలా బిజీగా గడిపారు. పలు కీలక కేసుల్లో తీర్పు ఇచ్చారు. అయోధ్య భూవివాదం కేసు నుంచి రాఫెల్ వరకు ప్రధాన కేసుల్లో ఆయన తీర్పు ఇచ్చారు. ఇక శుక్రవారం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టులో చివరిరోజు గడిపారు. చివరి రోజున రంజన్ గొగోయ్ ఎలా గడిపారు..?
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టులో చివరిరోజు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టులో తన చివరి రోజును గడిపారు. గత వారం రోజులుగా పలు ప్రధాన కేసుల్లో జడ్జిమెంట్ ఇచ్చారు. అయోధ్య భూవివాదం కేసు నుంచి రాఫెల్ కేసు, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం రివ్యూ పిటిషన్, ఆర్టీఐ పరిధిలోకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కార్యాలయం వంటి ప్రధాన కేసుల్లో తీర్పును ఇచ్చారు. ఇక శనివారం కోర్టు పనిచేయదు. ఆదివారం అంటే నవంబర్ 17వ తేదీన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ చేయనున్నారు.
కోర్టులో నాలుగు నిమిషాలు..10 కేసుల్లో నోటీసులు
ఇక చివరిరోజైన శుక్రవారం నాడు గొగోయ్ ఓ నోట్ను విడుదల చేశారు. బార్ సభ్యులు పరిమితికి మించి స్వేచ్ఛను వినియోగించుకోవడం లేదని ఆ నోట్లో పేర్కొన్నారు. జడ్జీలు పలు విషయాల్లో మౌనం వహిస్తున్నారంటే వారికి మాట్లాడటం చేతకాక కాదని, విధుల్లో భాగంగానే అలా ఉండాల్సి వస్తోందన్నారు రంజన్ గొగోయ్. అంతకంటే ఏమీ లేదని చెప్పారు. ఒకటవ నెంబర్ కోర్టు హాలులో మొత్తం నాలుగు నిమిషాల పాటు కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేతో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన ముందుకు వచ్చిన 10 కేసుల్లో నోటీసులు ఇచ్చారు.
మీడియా ముందుకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే..?
ఇక న్యాయవ్యవస్థ గురించి ఆయన ప్రస్తావించారు. తాను గతంలో మీడియా ముందుకు వచ్చిన విషయం గుర్తు చేసిన గొగోయ్.. మీడియా ముందుకు ఎందుకు రావాల్సి వచ్చిందో కారణం చెప్పారు. ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలిపేలా తాను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని అందుకే ఆరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పారు. చాలా మీడియా సంస్థలు చీఫ్ జస్టిస్ చివరిరోజు కావడంతో ఆయన ఇంటర్వ్యూలు అడిగిన నేపథ్యంలో జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ సమాధానం ఇచ్చారు.
కష్ట సమయాల్లో మీడియా పరిపక్వతతో వ్యవహరించింది
ఇక మీడియా ముందుకు ఎందుకు రావాల్సి వచ్చిందో అనేదానిపై వివరణ ఇస్తూ నాటి కష్ట కాలంలో మీడియా ఎంతో పరిపక్వతతో వ్యవహరించిందని కొనియాడారు. మెచ్యూరిటీ, క్యారెక్టర్తో మీడియా వ్యవహరించడంపై రంజన్ గొగోయ్ ప్రశంసించారు. ఇదిలా ఉంటే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆఫీసులో చివరి రోజు కావడంతో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాకేష్ ఖన్నా ఆయనకు వీడ్కోలు పలికారు. జడ్జీగా పదవీవిరమణ చేస్తున్న రంజన్ గొగోయ్ సంతోషకరమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. బార్ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు రాకేష్ ఖన్నా.