రిటైర్ అయ్యేలోగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పనున్న తీర్పులు ఇవే..!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందేందుకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ లోగా ఆయన పలు కీలక కేసుల్లో తీర్పు ఇవ్వనున్నారు. అయోధ్య, వివాదం కేసు, రాఫెల్ కేసులతో పాటు మరికొన్ని కేసుల్లో తీర్పు ఇవ్వనున్నారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్.
అయోధ్య భూవివాదం కేసులో తీర్పు
నవంబర్ 17న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రిటైర్ కాబోతున్నారు. దిపావళి సెలవుల తర్వాత కోర్టు తిరిగి తెరుచుకోవడంతో రెండు వారాల వ్యవధిలోనే కీలక తీర్పులను ఇవ్వనున్నారు. రాజకీయ అంశంగా మారిన వివాదాస్పద అయోధ్య భూవివాదం కేసులో జస్టిస్ రంజన్ గోగొయ్ తీర్పు ఇవ్వనున్నారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దాదాపు 40 రోజుల పాటు వాదనలు విని అక్టోబర్ 16న తీర్పును రిజర్వ్లో ఉంచింది. 2.77 ఎకరాల భూమి ఎవరికి చెందాలనే అంశంపైనే వివాదం రాజుకుంది. ఇందులో హిందూసంఘాలు, ముస్లిం పార్టీలు పిటిషనర్లుగా ఉన్నారు. మూడు పార్టీలు భూమిని సమానంగా పంచుకోవాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
రాఫెల్పై దాఖలైన రివ్యూ పిటిషన్లు
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ దేశాన్ని కుదిపేసిన రాఫెల్ అంశంపై కూడా తీర్పు చెప్పనున్నారు.సుప్రీం కోర్టు గతేడాది డిసెంబర్ 14న రాఫెల్ వివాదంపై తీర్పు ఇవ్వగా దీనిపై రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు వినింది. సభ్యులుగా జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్లు ఉన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా అరుణ్ శౌరీలతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్లు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. ఇక దీంతో పాటు రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై చేసిన చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యలపై కూడా తీర్పు చెప్పనున్నారు. ఈ పిటిషన్ను సీనియర్ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేశారు.
చీఫ్ జస్టిస్ కార్యాలయం ఆర్టీఐ కిందకు వస్తుందా లేదా..?
ఇక సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి కార్యాలయం సమాచారహక్కు చట్టం పరిధిలోకి వస్తుందా రాదా అనేదానిపై కూడా ఏప్రిల్ 4న వాదనలు ముగియగా దీనిపై కూడా తీర్పు చెప్పనున్నారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు వినింది. ఇందులో సభ్యులుగా జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్ , జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు ఉన్నారు.
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై రివ్యూ పిటిషన్లు
ఇక శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశించొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో కూడా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పు ఇవ్వనున్నారు. గతేడాది సెప్టెంబర్లో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రలు తీర్పు చెప్పారు. అయితే దీనిపై పలు రివ్యూ పిటిషన్లు దాఖలు అయ్యాయి. కేంద్రం పార్లమెంటులో మనీ బిల్ అని పేర్కొంటూ ఆర్థికచట్టం 2017ను ఆమోదించింది. అయితే బిల్లుకు రాజ్యాంగ ప్రామాణికత ఉందా లేదా అనేదానిపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పు చెప్పనున్నారు. ఈ కేసులో వాదనలు ఏప్రిల్ 2న విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్లో ఉంచింది.