ఆయన చెబితే చేశా: తన తప్పును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదికి నెట్టేసిన న్యాయవాది
న్యూఢిల్లీ: రామజన్మభూమి-బాబ్రీ మసీదు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న హైడ్రామాకు ప్రధాన కారకుడైన సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధవన్.. తాను చేసిన తప్పును ఏకంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ మీదికే నెట్టేశారు. అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టులో తుది విచారణ కొనసాగుతున్న సమయంలో హిందూ మహాసభ తరపు న్యాయవాది వికాస్ సింగ్ చేతుల్లో ఉన్న అయోధ్య రివిజిటెడ్ పుస్తకాన్ని, కొన్ని మ్యాపులను చించేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రాజీవ్ ధవన్ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. పుస్తకం చింపేయడానికి గల కారణాలను వివరించారు.
ఇవిగో రుజువులు: బాబ్రీ మసీదు కింద ఆలయం ఉండేదన్న లాయరు
అయోధ్య రీవిజిటెడ్ పుస్తకంలోని కొన్ని పేజీలు, మ్యాపులను తాను చింపేసిన విషయం నిజమేనని, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ దీనికి కారణమని అన్నారు. ఆయన చెబితేనే తాను పేజీలను చింపేశానని అన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కునాల్ కిశోర్ రాసిన పుస్తకం అది. అందులోని కొన్ని అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయని తాను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. నిజంగా వివాదాస్పద అంశాలు అందులో ఉంటే చింపేయాలని గొగొయ్ తనను సూచించారని చెప్పారు. ఇలాంటి పుస్తకాల మీద ఆధారపడి సుప్రీంకోర్టు చారిత్రాత్మక విషయాలపై ఓ అభిప్రాయానికి రాకూడదని అన్నారు. హిందూ ధార్మిక సంఘాల తరఫున వాదిస్తోన్న పీఎన్ మిశ్రా చేసిన కొన్ని వ్యాఖ్యలు మూర్ఖంగా ఉన్నాయని రాజీవ్ ధవన్ విమర్శించారు.
అయోధ్య రీవిజిటెడ్ పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని అంశాలను న్యాయవాది వికాస్ సింగ్ చదవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో- సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున కేసును వాదిస్తోన్న న్యాయవాది రాజీవ్ ధవన్ దాన్ని లాగేశారు. తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ పుస్తకాన్ని చింపేయడానికి ప్రయత్నించారు. కొన్ని పేజీలను చింపేశారు కూడా. ఈ సందర్భంగా తోటి న్యాయవాదులు రాజీవ్ ధవన్ ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ సమక్షంలోనే ఈ హైడ్రామా నడిచింది. దీనితో ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజన విరామం అనంతరం కూడా విచారణ సందర్భంగా న్యాయవాదుల మధ్య వాడివేడిగా వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పుస్తకాన్ని చించేయడాన్ని పీఎన్ మిశ్రా తప్పు పట్టారు. కీలకమైన అంశాలు, వాదనలు చోటు చేసుకుంటున్న సమయంలో ఓ సీనియర్ న్యాయవాది చేయాల్సిన పని ఇది కాదని అంటూ చురకలు అంటించారు. దీనిపై రాజీవ్ ధవన్ అసహనం వ్యక్తం చేశారు. మీకు చరిత్ర గురించి తెలియదు. కూర్చోండి. మీరు చేస్తోన్న వాదనలు ముర్ఖంగా ఉన్నాయి..అని పీఎన్ మిశ్రాను ఉద్దేశించి చెప్పడంతో తోటి న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర్మాసనం జోక్యం చేసుకోవడంతో విచారణ కొనసాగింది.