కర్ణాటక సీఎం మాస్టర్ ప్లాన్, బీజేపీకి చాన్స్ ఇవ్వకూడదు, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం, ఓకే !
బెంగళూరు: 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గరు జేడీఎస్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే, సస్పెండ్ కు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామాలతో మైనారిటీలో పడిపోయిన కర్ణాటక ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అసెంబ్లీలో బీజేపీకి చాన్స్ రాకుండా చెయ్యాలని చూస్తున్నారు
స్వయంగా సీఎం !
రాజీనామాలతో ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్న ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకోవడానికి తానే స్వయంగా శాసన సభ సమావేశంలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టడానికి సిద్దం కావాలని సీఎం కుమారస్వామి నిర్ణయించారని తెలిసింది. న్యాయనిపుణుల సలహా తీసుకున్న సీఎం కుమారస్వామి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
జులై 12 అసెంబ్లీ !
జులై 12వ తేదీ కర్ణాటక శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తున్నారు. విప్ జారీ చేసిన తరువాత ప్రభుత్వానికి మద్దతుగా రెబల్ ఎమ్మెల్యేలు ఓటు వెయ్యకపోతే పార్టీ పిరాయింపుల చట్టం కింద వారిని అనర్హులు చెయ్యడానికి చర్యలు తీసుకోవాలని సీఎం కుమారస్వామి సిద్దం అవుతున్నారు.
ఎమ్మెల్యేలకు చెక్
రాజీనామాలు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేల ప్లాన్ తిప్పికొట్టడానికి సీఎం కుమారస్వామి చర్యలు తీసుకుంటున్నారు. న్యాయనిపుణులు, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడతో చర్చలు జరిపిన తరువాత సీఎం కుమారస్వామి ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం.
పార్టీ ఆదేశాలు
విప్ జారీ అయిన తరువాత పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వెయ్యడానికి వీలులేదు. శాసన సభ సమావేశాలకు ఎమ్మెల్యేలు గైహాజరుకావడానికి అవకాశం లేదు. ప్రస్తుతం పరిస్థితుల్లో రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామాల విషయంలో ఆలోచనలో పడ్డారని తెలిసింది.
బీజేపీ దెబ్బకు !
జులై 12వ తేదీ శాసన సభా సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టాలని బీజేపీ సిద్దం అవుతోంది. బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకుండా తానే అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఎం కుమారస్వామి ఆలోచిస్తున్నారని తెలిసింది.