మా నాన్న సమాధిని తొలగించండి: ఆయన జ్ఞాపకాలేవీ ఉండనివ్వొద్దు: ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం..!
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ సమాధిని తొలగించాని నిర్ణయించారు. నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఆదేశాలను కూడా జారీ చేశారు. బిజూ పట్నాయక్ సమాధి సహా, ఆయన జ్ఞాపకార్థం కోసం ఏర్పాటు చేసిన స్మారక కేంద్రాన్ని కూడా తొలగించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన పూరి పుణ్యక్షేత్రంలో బిజూ పట్నాయక్ సమాధి ఉంది. స్వర్గద్వార్ అనే పేరుతో బిజూ స్మారక కేంద్రం, శ్మశాన వాటికను అక్కడ ఏర్పాటు చేశారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలంటూ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. బిజూ పట్నాయక్ సమాధి ఉండటం వల్ల దాన్ని తొలగించడం అసాధ్యమని, శ్మశాన వాటికను అభివృద్ధి చేయడం దాదాపు అసాధ్యమంటూ విమర్శలు కూడా చెలరేగాయి.
వాటన్నింటినీ ఒకే ఒక్క నిర్ణయంతో చెక్ పెట్టారు నవీన్ పట్నాయక్, తన తండ్రి సమాధాని, స్మారక కేంద్రాన్ని తొలగించాలని ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ, పూరి నగరాభివృద్ధి ప్రత్యేక అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. శ్మశాన వాటికను అభివృద్ధి చేయడానికి అయిదు కోట్ల రూపాయలను కూడా అప్పటికప్పుడు మంజూరు చేశారు.
బిజూ పట్నాయక్ మరణం అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన కుమారుడు నవీన్ పట్నాయక్ 2000లో ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. జనతాదళ్ నుంచి బయటికి వచ్చిన ఆయన తండ్రి పేరుతో బిజూ జనతాదళ్ (బీజేడీ)ని స్థాపించారు. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2000లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ ఆయనే ముఖ్యమంత్రి. 2004, 2009, 2019ల్లో ఒడిశా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేడీ వరుస విజయాలను సాధిస్తూ వచ్చింది. మరో పార్టీకి అవకాశమే ఇవ్వలేదు. నవీన్ పట్నాయక్ కు ఉన్న మంచి పేరు వల్లే ఆయన ఓటమి అనేదే లేకుండా గెలుస్తున్నారని చెబుతున్నారు పార్టీ నాయకులు.