అప్పుడు ఫంక్షన్హాల్స్లో పెళ్లి వేడుకలు రద్దు, యోగి ప్రభుత్వం ఆదేశాలు, ఎందుకంటే?
లక్నో: వచ్చే ఏడాది కుంభమేళా సమయంలో ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లు రద్దు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో (గతంలో అలహాబాద్) 2019 జనవరి నుంచి మార్చి వరకు పెళ్లిళ్లు జరగకూడదని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రయాగ్రాజ్ జిల్లా యంత్రాంగం అన్ని ఫంక్షన్ హాళ్లు, అతిథి గృహాలు, హోటళ్లకు ఉత్తర్వులను పంపించింది. ముందస్తు బుకింగ్లను అన్నింటినీ రద్దు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ సమయంలో కుంభమేళా ఉన్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కుంభమేళాకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. దీంతో వారికి ఫంక్షన్ హాళ్లు, అతిథి గృహాల్లో బస ఏర్పాటు చేసేందుకే ప్రభుత్వం పెళ్లి వేడుకలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొంతమంది పెళ్లి తేదీ వాయిదా వేసుకుంటున్నారు. మరికొంత మంది కల్యాణ వేదికను మరో చోటికి మార్చుకుంటున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జనవరిలో కుంభస్నానాలు మొదలయ్యే ఒక రోజు ముందు నుంచి మార్చిలో కార్యక్రమం ముగిసే తర్వాతి రోజు వరకు పెళ్లిళ్ల వేడుకలు జరపకూడదు. కుంభమేళాలో భాగంగా దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో సాధువులు, మునులతో పాటు భక్తులు తరలి వస్తారు. ఈ సమయంలో ప్రయాగ్రాజ్లోని గంగా నదిలో ఆరు రకాల స్నానాలు చేస్తారు. జనవరిలో మకర సంక్రాంతి, పుష్యమి పూర్ణిమ స్నానాలు, ఫిబ్రవరిలో మౌని అమావాస్య, బసంత్ పంచమి, మాఘీ పూర్ణిమ స్నానాలు, మార్చిలో మహా శివరాత్రి స్నానమాచరిస్తారు.
కుంభమేళాలో భాగంగా గంగా నదిని పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో కాన్పూర్లోని తోళ్ల పరిశ్రమలన్నీ ఈ ఏడాది డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది మార్చి 15 వరకూ మూసివేయాలని యోగి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.