కేజ్రీవాల్ను అభినందించిన వైఎస్ జగన్: పలువురు ముఖ్యమంత్రుల శుభాకాంక్షలు..!
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు తోటి రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ సాధించిన ఘన విజయం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని కేజ్రీవాల్ దెబ్బ కొట్టారని వ్యాఖ్యానిస్తున్నారు.
తిరుగులేని మెజారిటీ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ తిరుగులేని మెజారిటీని సాధించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ స్థాయి ఘన విజయాన్ని సాధించినందుకు ఆయన కేజ్రీవాల్కు శుభాకాంక్షలను తెలిపారు. మరిన్ని విజయాలను సాధించాలని అకాంక్షించారు. వచ్చే అయిదేళ్ల పాటు జనరంజకంగా పరిపాలన సాగించాలని కోరారు. ఈ మేరకు వైఎస్ జగన్ మంగళవారం ఓ ట్వీట్ చేశారు.
మత రాజకీయాలకు చెల్లుచీటీ: మమతా బెనర్జీ
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. దీన్ని సామాన్యుడు సాధించిన విజయంగా ఆమె అభివర్ణించారు. మత రాజకీయాలకు చెల్లుచీటీ పాడేలా కేజ్రీవాల్ ఈ విషయాన్ని నమోదు చేశారని కితాబిచ్చారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే తాము అండగా ఉంటామని ఢిల్లీ ప్రజలు మరోసారి రుజువు చేశారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. బీజేపీ రాజకీయ కుట్రలకు కాలం చెల్లిందని విమర్శించారు.
అభివృద్ధికే పట్టం: పినరయి విజయన్
ఢిల్లీ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. కేజ్రీవాల్ను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల కేజ్రీవాల్ తిరుగులేని విజయాన్ని సాధించారని ప్రశంసించారు. ప్రజలు తమకు ప్రాతినిథ్యాన్ని వహించే వారికే ఓటు వేస్తారనే విషయాన్ని ఢిల్లీ ఓటర్లు మరోసారి నిరూపించారని అన్నారు. ప్రజలను భాగస్వామ్యులను చేసే ప్రభుత్వానిదే తుది విజయం అవుతుందని పినరయి వ్యాఖ్యానించారు.
ఉదారవాదానికే ఓటు వేసిన ఢిల్లీ ప్రజలు: అఖిలేష్ యాదవ్
ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వారికే వేశారని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రజల ఆలోచనా పరజ్ఙానానికి ఢిల్లీ ఎన్నికలు అద్దం పట్టాయని చెప్పారు. మత రాజకీయాలు, ప్రలోభాలకు లొంగలేదని అన్నారు. ఉదార వాదాన్ని ప్రజలు విస్మరించలేదని అన్నారు. రాజకీయంగా, సామాజికంగా ప్రజలు ఎంత చైతన్యవంతులుగా ఉన్నారనే విషయాన్ని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని చెప్పారు.
సమాఖ్య బలోపేతానికి ఇలాంటి విజయం అవసరం: స్టాలిన్
దేశంలో సమాఖ్య వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే అరవింద్ కేజ్రీవాల్, ఆయన సారథ్యంలోని ఆమ్ఆద్మీ పార్టీ సాధించినటువంటి విజయాలు మరిన్ని నమోదు కావాల్సిన అవసరం ఉందని డీఎంకే అధినేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ అన్నారు. కేజ్రీవాల్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య పునాదుల మీద నిర్మితమైన మనదేశంలో మత రాజకీయాలకు అవకాశమే లేదనే విషయాన్ని ఈ విజయం చాటి చెప్పిందని అన్నారు.