జనం మధ్యే కేజ్రీ పట్టాభిషేకం: నో చీఫ్ మినిస్టర్స్..నో పొలిటికల్ లీడర్స్: ప్రజలే చీఫ్ గెస్ట్గా
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల సీనియర్ నాయకులు హాజరు కావడం ఆనవాయితీ. ఓట్లేసి గెలిపించిన ప్రజల కంటే అలా ప్రమాణ స్వీకారానికి వచ్చిన వారికే అతిథి మర్యాదలు చేస్తుంటుంది అధికార యంత్రాంగం. అలాంటి సంప్రదాయానికి పుల్స్టాప్ పెట్టబోతున్నారు ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.
Executive Capital: డెడ్లైన్..బడ్జెట్ భేటీ: ఆ తరువాతే విశాఖకు: చిక్కులన్నీ వీడిటానికి సమయం...!
Recommended Video
జనం మధ్య ముచ్చటగా మూడోసారి..
ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆయన ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ సారి తన ప్రమాణ స్వీకారానికి ఏ ముఖ్యమంత్రిని గానీ, ఏ ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను గానీ ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నారు. ప్రజల మధ్యే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తన ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ ప్రజలను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఢిల్లీకి ప్రత్యేకం..
ఈ విషయాన్ని ఆమ్ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్ రాయ్ వెల్లడించారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించట్లేదని తెలిపారు. వారెవరికీ ఆహ్వాన పత్రాలను పంపించట్లేదని స్పష్టం చేశారు. వరుసగా మూడోసారి తమకు పట్టం కట్టిన ఢిల్లీ ప్రజలను మాత్రమే ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఢిల్లీ ప్రజా సంఘాలు, కాలనీల అసోసియేషన్లకు..
తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజల మధ్యే ప్రమాణ స్వీకారం చేయాలని కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం..చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు గోపాల్ రాయ్. ప్రజలను మాత్రమే పిలవాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఢిల్లీలోని అసోసియేషన్లు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న యూనియన్లను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
రామ్లీలా మైదాన్లో 50వేల మంది జనం మధ్య..
రామ్లీలా మైదాన్లో కనీసం 50 మందిని ఆహ్వానించడానికి ఆమ్ఆద్మీ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఆదివారం కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. రామ్లీలా మైదాన్ సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చనున్నారు. ఆయా స్క్రీన్లపై కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వేలాదిమంది ఒకే చోట గుమికూడాల్సి వస్తుండటం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఢిల్లీ పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలను తీసుకుంటోంది.