గాలి జనార్దన్ రెడ్డితో భేటీ: బీజేపీతో చర్చలు, జిందాల్ ఆసుపత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే క్లారిటీ!
బెంగళూరు: కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిక్కబళ్లాపురం శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ బీజేపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డితో ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ చర్చలు జరిపారని మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. అయితే తాను జిందాల్ ఆసుపత్రిలో ఉన్నానని డాక్టర్ సుధాకర్ అంటున్నారు.
మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఈ విషయాలు వింటుంటే నవ్వు వస్తోందని చిక్కబళ్లాపుర శాసన సభ్యుడు డాక్టర్ సుధాకర్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తాను బీజేపీలో చేరుతున్నానని కావాలనే ఎవరో ప్రచారం చేస్తున్నారని డాక్టర్ సుధాకర్ ఆరోపిస్తున్నారు.
వెన్ను నొప్పి కారణంగా తాను బెంగళూరు-ముంబై రహదారిలో నెలమంగల సమీపంలోని జిందాల్ ప్రకృతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నానని, తాను కనపడకపోవడంతో ఇలా పార్టీ మారుతున్నానని ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. తన నియోజక వర్గ ప్రజలు ఇలాంటి పుకార్లు నమ్మకూడదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ట్వీట్ చేశారు.
ఎలాంటి పరిస్థితిలో తాను బీజేపీలో చేరనని, ఇప్పటి వరకు మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో భేటీ కాలేదని, ఎవరో కావాలనే ప్రచారం చేస్తున్నారని డాక్టర్ సుధాకర్ వివరణ ఇచ్చారు. మొత్తం మీద కర్ణాటకలో ఆపరేషన్ కమల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.