దారుణం: చిక్ మంగళూరులో బీజేపీ కార్యదర్శి హత్య
కర్నాటక చిక్మంగళూరులో దారుణం జరిగింది. చిక్మంగళూరు బీజేపీ కార్యదర్శి మొహ్మద్ అన్వర్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గత రాత్రి తన పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా గౌరీ కెనాల్ వద్ద గుర్తు తెలియని దుండగులు బైక్ పై వచ్చి కత్తితో నరికారు. అక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిన అన్వర్ స్పాట్లోనే ప్రాణాలు వదిలాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కొద్ది రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తల హత్య తీవ్ర కలకలం రేపుతోంది. చనిపోయిన వారంతా చాలా అనుమానాస్పద స్థితిలో కనిపించారు.ఈ నెల మొదటి వారంలో బెంగాల్లోని ఓ గ్రామంలో చనిపోయిన బీజేపీ కార్యకర్త విద్యుత్ తీగలకు వేలాడుతూ కనిపించాడు. అంతకుముందు పురులియా జిల్లాలో మరో బీజేపీ కార్యకర్త చెట్టుకు ఉరివేసుకుని ఉన్నట్లుగా అనుమానాస్పద స్థితిలో కనిపించాడు.
ఈ మరణాలపై బీజేపీ స్పందించింది. బీజేపీ కార్యకర్తల మరణాలన్నీ రాజకీయ హత్యలే అని ఓ ప్రకటనలో తెలిపింది. చిన్న వయసులోనే బీజేపీ కార్యకర్తలు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు.