అదే అనుమానం..అవే పుకార్లు: మానసిక వికలాంగుడిని కొట్టి చంపిన జనం!
లక్నో: గ్రామాల్లో క్షణాల్లో వ్యాపించే పుకార్లు, జనాల్లో మొలకెత్తిన అనుమానాలు.. మరో అమాయకుడి ప్రాణాలను బలిగొన్నాయి. పిల్లలను ఎత్తుకెళ్లడానికి వచ్చాడంటూ నిమిషాల వ్యవధిలో వ్యాపించిన వదంతులను నిజమని భావించిన కొందరు గ్రామీణులు.. ఓ మానసిక వికలాంగుడిని కొట్టి చంపేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ అమ్రోహా జిల్లా డెహ్రీ ఖదర్ లో చోటు చేసుకుంది. మానసిక వికలాంగుడి ప్రవర్తనను అనుమానించిన గ్రామీణులు.. ఆ వ్యక్తిని వెంటపడి మరీ కొట్టి చంపారు. అనంతరం దీన్నుంచి బయటపడటానికి రోడ్డు ప్రమాదం అనే రంగుపూయ డానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై పోలీసులు కొందరు గ్రామీణులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.
సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం: కాశ్మీర్ కు ఆర్మీ చీఫ్: పాక్ కళ్లన్నీ ఆయన టూర్ మీదే
అమ్రోహ సమీపంలోని ఆదమ్ పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి కొద్దిరోెజులుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. గురువారం రాత్రి ఆయన డెహ్రీ ఖదర్ గ్రామానికి వెళ్లగా.. స్థానికులు ఆయనను పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తిగా భావించారు. తొలుత అతణ్ని పట్టుకుని చేతులు వెనక్కి విరిచి కట్టారు. ప్రశ్నల వర్షం కురిపించారు. మానసిక వికలాంగుడు కావడంతో వారి ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ఇవ్వలేకపోయాడతను. దీనితో గ్రామస్తుల అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ అనుమానంతోనే అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. చేతికి అందిన వస్తువులతో కొట్టి చంపారు. అనంతరం- తమ చేసిన దారుణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించబోయారు. మానసిక వికలాంగుడి మృతదేహానికి తాడు కట్టి లాక్కుంటూ వెళ్లారు. ఓ ఫ్లైఓవర్ మీది నుంచి కిందికి పడేశారు. ప్రమాదంగా చిత్రీకరించారు.
దీనిపై సమాచారం అందడంతో ఆదమ్ పూర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మానసిక వికలాంగుడిపై దాడి చేసిన వారిలో కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ కు తరలించారు. దర్యాప్తు సాగిస్తున్నారు. వారిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నెలరోజుల వ్యవధిలో ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న రెండో మూకదాడి ఇది. ఇదివరకు సంభాల్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులను స్థానికులు కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్ లో వందకు పైగా మూకదాడులు చోటు చేసుకున్నాయి. ఝాన్సీ, మీరట్, బరేలీ, సంభల్, జౌన్ పూర్, ఉన్నవ్, రాయ్ బరేలీ వంటి జిల్లాల్లో మూకదాడులకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. మూకదాడులకు పాల్పడిన వారిపై అత్యంత కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నప్పటికీ.. అవి ఆగట్లేదు.