'చిన్నారుల సెక్స్ ట్రేడ్ విలువ 343 బిలియన్ డాలర్లు'
న్యూఢిల్లీ: భారత దేశంలో చిన్నారులతో జరుగుతున్న వ్యభిచారం 343 బిలియన్ డాలర్ల వ్యాపారంగా ఉందని నోబెల్ శాంతి బహుమతి విజేత, బాలల హక్కుల ఉద్యమకర్త కైలాశ్ సత్యార్థి చెప్పారు. నేపాల్, బంగ్లాదేశ్ల నుంచి అపహరించిన అమ్మాయిలతో ఈ తరహా వ్యభిచారం నిరాఘాటంగా సాగుతోందని సత్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు.
సత్యార్థి నేతృత్వంలోని గ్లోబల్ మార్చ్ అగెయినెస్ట్ చైల్డ్ లేబర్ పైన ఓ అధ్యయనం చేసింది. భారత్లో పసిపిల్లలతో చేయిస్తున్న ఈ తరహా వ్యభిచారం తరాలుగా కొనసాగుతోందని కూడా ఎకానమిక్స్ బిహైండ్ ఫోర్స్ డ్ లేబర్ ట్రాఫికింగ్ పేరిట విడుదలైన ఆ అధ్యయనం తెలిపింది.
ఈ అధ్యయనం ప్రకారం భారత్లో 36 లక్షల మంది చిన్నారులు బలవంతంగా పని కూపంలో కొనసాగుతున్నారు. వీరిలో 60 శాతం మంది బీహార్, అసోంలకు చెందినవారే. ఇందులో 77.5 శాతం మంది పిల్లలు బాలికలే కావడం గమనార్హం. 14 నుంచి 16 ఏళ్ల వయసు మధ్యనున్న బాలికలను ట్రాఫికర్లు వ్యభిచారంలోకి నెట్టేస్తున్నారు.
దేశవ్యాప్తంగా 1,100 రెడ్ లైట్ ఏరియాలుండగా, ఒక్కో రెడ్ లైట్ ఏరియాలో 140 దాకా బ్రోతల్ హౌస్లు ఉన్నాయి. ఒక్కో బ్రోతల్ హౌస్ పిల్లల ద్వారా ఏటా 24 లక్షల డాలర్లను ఆర్జిస్తోంది. ఈ లెక్కన దేశంలో బాలికలను వ్యభిచార కూపంలోకి నెట్టడం ద్వారా ఏటా 343 బిలియన్ డాలర్ల మేర వ్యాపారం సాగుతోందని ఆ అధ్యయనం తేల్చింది.
తల్లి ఒడి చేరిన చిన్నారి
ఫేస్బుక్ ఓ చిన్నారి అమ్మ ఒడికి చేరింది. ఏడాది క్రితం మేఘా అనే ముంబై బాలిక తప్పిపోయింది. తల్లిదండ్రులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఎంత వెతికినా కనిపించకపోవటంతో ఇక తమ బిడ్డ కనిపించదని ఆశలు వదులుకున్నారు. నజీర్ అహ్మద్ అనే కర్కోటకుడు ఆ చిన్నారిని ఎత్తుకుపోయి నానారకాలుగా హింసించి భిక్షాటన చేయించాడు.
భిక్షాటనలో భాగంగా పూణె, కోల్కతా, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలలో తిప్పాడు. చివరకు భిక్షాటన చేయిస్తూ జమ్ము కాశ్మీర్కు మేఘాతో వచ్చాడు. అదే సమయంలో అక్కడ వరదలు వచ్చాయి. దీంతో వాడు ఇక్కడ నాకే పొట్ట గడవటం కష్టంగా ఉంది. ఇక ఈ పాప ఎందుకేమో అనుకొని కాశ్మీర్లో వదిలేసి వెళ్లిపోయాడు.
ఆ పాపను స్థానిక ఇమామ్ చేరదీసి సంరక్షణార్థం ఓ కుటుంబానికి అప్పజెప్పాడు. అంతేకాదు ఆ చిన్నారి నుంచి వివరాలు సేకరించి, ఆమె ఫొటోలను ఫేస్బుక్లో పెట్డాడు. పోలీసులు ఆ ఫేస్బుక్ వివరాలను, తప్పిపోయిన బాలిక వివరాలతో సరిపోల్చుకుని ఆ చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు.