బంగ్లాదేశ్ టూ కేరళ: పిల్లల అక్రమ రావాణ, అమ్మేస్తారు, భిక్షాటన చేయించి రూ. లక్షల్లో !
పిల్లలను అక్రమంగా తరలించి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. 40 మంది పిల్లలను రక్షించి మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించామని.
బెంగళూరు: పిల్లలను అక్రమంగా తరలించి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. 40 మంది పిల్లలను రక్షించి మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించామని రామమూర్తి నగర పోలీసులు తెలిపారు.
మంగళవారం గుహవాటి నుంచి బెంగళూరుకు రైలు వచ్చింది. ఈ రైలులో 40 మంది పిల్లలు వచ్చారు. వారిని కేరళకు తరలించడానికి ప్రయత్నించారు. అదే రైలులో ప్రయాణించిన నాయక్ అనే వ్యక్తికి అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కేఆర్ పురం రైల్వేస్టేషన్ చేరుకున్న రామమూర్తి నగర పోలీసులు 40 మంది చిన్నారులను తరలిస్తున్న పలువురుని అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా పిల్లలను తీసుకు వచ్చి బెంగళూరు మీదుగా కేరళ తరలించడానికి ప్రయత్నించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
పిల్లలను విక్రయించడం, వారితో ప్రతి రోజూ భిక్షాటన చేయించి రూ. లక్షల్లో డబ్బులు సంపాధించడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. పిల్లలు అందరూ 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారేనని, ఈ ముఠాలో ఇంకా ఎంత మంది ఉన్నారు అని ఆరా తీస్తున్నామని రామమూర్తి నగర పొలీసులు తెలిపారు.