మద్రాస్ హైకోర్టు సంచలనం: తండ్రి ఆస్తులే కాదు.. అప్పులూ కొడుకు తీర్చాల్సిందే!
చెన్నై: మద్రాస్ హైకోర్టు ఓ కేసులో సంచలన తీర్పునిచ్చింది. తండ్రి మరణానంతరం సంక్రమించే ఆస్తులను వారసులు తీసుకోవడం మాత్రమే కాదు, దాంతో పాటు తండ్రి చేసిన అప్పులను కూడా వారు తీర్చాలని స్పష్టం చేసింది.
తన తండ్రి నివాసంలో పనిచేస్తూ మరణించిన ఓ కార్మికుడి కుటుంబానికి చెల్లించని నష్టపరిహారాన్ని ఆయన తనయుడు చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. చెన్నైలోని సైదాపేటలో సదరు కార్మికుడు మరణించిన 17 ఏళ్ల తర్వాత హైకోర్టు ప్రస్తుతం ఈ మేరకు తీర్పునివ్వడం గమనార్హం.
ఈ తీర్పు సందర్భంగా జస్టిస్ ఎస్ వైద్యనాథన్ మాట్లాడుతూ... 'మన పురాణ ధర్మశాస్త్రాల్లో నైతిక బాధ్యతల ప్రస్తావన ఉంది. ఆ ప్రకారం, రుణం చెల్లించకపోవడం పాపం కిందకు వస్తుంది. అది పై లోకంలో తీవ్ర నరకానికి గురిచేస్తుంది. రాముడు తన తండ్రి మాటకు కట్టుబడిన రీతిలో బాధిత కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత పిటిషనర్కి ఉంది..' అని వ్యాఖ్యానించారు.
ఆగస్టు 26, 2001న మరణించిన కార్మికుడు నరసింహన్ చట్టబద్ధ వారసురాలు ఆదిలక్ష్మీకి రూ.10 లక్షల పరిహారాన్ని చెల్లించాలంటూ ఆగస్టు 21, 2017న చెన్నై కార్పొరేషన్ జారీ చేసిన ఆదేశాన్ని సవాలు చేస్తూ ఎ.రవిచంద్రన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్ వైద్యనాథన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బాధిత కుటుంబానికి తమ తండ్రి ఎప్పుడో పరిహారం చెల్లించారని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు.
నిజానికి ఘటన జరిగిన తర్వాత 15 ఏళ్ల వరకు ఆదిలక్ష్మీ మౌనంగానే ఉన్నదని, కానీ 2016లో చెన్నై కార్పొరేషన్ ఆమె తరపున నష్టపరిహారం కోరిందని, ఇదంతా తర్వాత పుట్టిన ఆలోచన అనేది పిటిషనర్ రవిచంద్రన్ తరపు లాయర్ వాదన.
అందువల్ల కార్పొరేషన్ ఆదేశాన్ని కొట్టివేయాలంటూ ఆయన కోర్టును కోరారు. కానీ, కోర్టు పిటిషనర్ రవిచంద్రన్ విన్నపాన్ని తోసిపుచ్చుతూ.. మరో రెండు నెలల్లో మొత్తం పరిహారాన్ని బాధిత కుటుంబానికి చెల్లించాలని స్పష్టం చేసింది.