3-4 నెలల్లో చిన్నారులకు కూడా టీకా.. క్లినికల్ ట్రయల్స్ కోసం ప్రపోజల్: కృష్ణ ఎల్లా
కరోనా వైరస్ టీకాల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్ ప్రయోగం చివరి దశకు చేరుకోగా.. తొలుత సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న యువతకు అందజేస్తారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ తర్వాతే వీరికి ఇస్తారు. అయితే చిన్నపిల్లలు, వృద్దుల సంగతేంటి అంటే.. వారికి మరో 3 నుంచి 4 నెలల సమయం పడుతోందని భారత్ బయోటెక్ చెబుతోంది.
2 నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులకు 4 నెలల్లో టీకా ఇస్తామని భారత్ బయోటెక్ తేల్చిచెప్పింది. కానీ ప్రస్తుతం తమ వద్ద ఉత్పత్తి అవుతోన్న టీకాలు మాత్రం 16 ఏళ్లు.. ఆపై వారికి మాత్రమేనని స్పష్టంచేసింది. అయితే 12 ఏళ్లు/ ఆపై వారికి ఎమర్జెన్సీగా ఇచ్చేందుకు అనుమతి ఉంది అని గుర్తుచేశారు. అయితే తమకు రెగ్యులేటరి అనుమతి ఇస్తే క్లినికల్ ట్రయల్స్ చేయాల్సి ఉంటుందని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. 12 ఏళ్ల లోపు పిల్లల క్లినికల్ ట్రయల్స్కు సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీకి ప్రపోజల్ సమర్పిస్తామని ఆయన తెలిపారు.
ఇప్పటికే 3 క్లినికల్ ట్రయల్స్ చేశామని.. పిల్లలకు సంబంధించి మాత్రం చేయాల్సి ఉంది అని చెప్పారు. కోవాక్సిన్ టీకాను భారత్ బయోటెక్ డెవలప్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా సహకారం అందిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ గతేడాది సెప్టెంబర్లో పరీక్షించారు. రెండో క్లినికల్ ట్రయల్స్లో భాగంగా 380 మంది 12 నుంచి 65 ఏళ్ల లోపు గల వాలంటీర్లను పరీక్షించారు. ఎమర్జెన్సీ టీకా ఇచ్చేందుకు భారత్ బయోటెక్ ఇటీవల కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.