మన పిల్లలకు అవి నేర్పకపోవడంతోనే విదేశాల్లో బీఫ్ తింటున్నారు: గిరిరాజ్ సింగ్
బెగుసరాయ్: వివాదాలకు కేరాఫ్గా పేరున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. దేశంలో ఉన్న పిల్లలు చాలామంది విదేశాలకు వెళుతుంటారని అక్కడికి వెళ్లి బీఫ్ తింటారని చెప్పారు. అలా గోమాంసం తినే పిల్లలకు వారి తల్లిదండ్రులు మన సంస్కృతిని, సంప్రదాయాలను నేర్పలేదని వ్యాఖ్యానించారు. స్కూళ్లల్లో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పిన గిరిరాజ్ సింగ్ ఐఐటీల్లో చదువుకున్న విద్యార్థులు ఇంజినీర్లు అయి విదేశాలకు వెళ్లి అక్కడ బీఫ్ తింటున్నారని అన్నారు.
భారతదేశ విలువలు, సంప్రదాయాలు, సంస్కృతి పిల్లలకు నేర్పకుండా ఆ తర్వాత వృద్ధ వయస్సులో ఉన్న తమను పిల్లలు సరిగ్గా చూసుకోవడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. శ్రీమద్భాగవత్ కథా గ్యపన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు భగవద్గీతను పాఠశాలలో ఎందుకు చేర్చాలో కూడా మంత్రి గిరిరాజ్ సింగ్ వివరించారు. భగవద్గీతలోని శ్లోకాలను స్కూళ్లో పిల్లలకు బోధించాలని చెప్పారు.
100 ఇళ్లల్లో ఒక సర్వే చేస్తే హనుమాన్ చాలీసా 15 ఇళ్లల్లో మాత్రమే కనిపించిందని భగవద్గీత రామాయణ పుస్తకాలు కేవలం మూడు ఇళ్లల్లోనే కనిపించాయని చెప్పారు గిరిరాజ్ సింగ్. అంటే తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారో దీన్ని బట్టే అర్థం అవుతుందని చెప్పిన గిరిరాజ్ సింగ్ ఈ విషయంలో పిల్లలను తప్పుపట్టేదానికి ఏమీ లేదని చెప్పారు. తప్పంతా తల్లిదండ్రులదే అని స్పష్టం చేశారు. భారత్ బతకాలంటే మనదేశ సంస్కృతిని కాపాడుకోగలిగితేనే అది జరుగుతుందని లేదంటే విపరీత ఫలితాలు ఉత్పన్నమవుతాయని చెప్పారు.