చైనా చేతికి భారత్ సాంకేతిక పరిజ్ఞానం? డ్రాగన్ కంట్రీ కావాలనే డ్రోన్ను కూల్చివేసిందా?
న్యూఢిల్లీ: ఒక్కోసారి చిన్న చిన్న తప్పులే భారీ మూల్యం చెల్లించుకోవడానికి కారణమవుతాయి. భారత్ విషయంలో ఇదే జరిగిందనిపిస్తోంది చూస్తుంటే. ఇటీవల భారత్కు చెందిన డ్రోన్ ఒకటి డోక్లామ్ సమీపంలో కూలిపోయిన సంగతి తెలిసిందే.
అయితే ఈ డ్రోన్ కూల్చివేతకు ముందు చాలా కథ నడిచిందని తెలుస్తోంది. డ్రోన్ అదృశ్యమైన రెండు వారాలపాటు చైనా కిమ్మనలేదు. ఆ తరువాత తాపీగా ఒక ప్రకటన చేసింది. భారత్కు చెందిన డ్రోన్ ఒకటి తమ భూభాగంలో దాదాపు 20 కిలోమీటర్ల లోపలికి వచ్చి కూలిపోయిందంటూ చైనా మిలిటరీ అధికారులు ఇటీవలే ప్రకటించారు.
అయితే ఆ డ్రోన్ వారి భూభాగంలో ఎక్కడ కూలిందో, ఎలా కూలిందో.. ఆ వివరాలు మాత్రం తెలియజేయలేదు. డ్రోన్ అదశ్యమైన రెండు వారాల తరువాత ఈ విషయాన్ని చైనా లీక్ చేయడంపై భారత్ అనుమానం వ్యక్తం చేస్తోంది.
అత్యంత అధునాతన హెరాన్ డ్రోన్...
భారత్ పోగొట్టుకుంది సాధారణ డ్రోన్ కాదు. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన అత్యంత అధునాతన హెరాన్ డ్రోన్. కమాండ్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయినా ఈ డ్రోన్ సురక్షితంగా తిరిగి రాగలదు. అలాంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మానవ రహిత నిఘా విమానమిది. అలాంటి అధునాత డ్రోన్ అసలు చైనా భూభాగంలోకి ఎందుకు ప్రవేశిస్తుంది? దానంతట అది అక్కడ ఎలా కూలిపోతుంది?
గగనతలం నుంచి భూభాగాలపై నిఘా...
ఈ హెరాన్ డ్రోన్ వాతావరణాన్ని కూడా అంచనా వేయగలదు. ప్రపంచంలో ఈ రకం డ్రోన్లకు మాత్రమే ఇలాంటి పరిజ్ఞానం ఉంది. 250 కేజీల సెన్సార్, థర్మోగ్రాఫిక్, ఇన్ఫ్రారెడ్ కెమెరా, గగనతలం నుంచి భూభాగాలపై నిఘా వేసే ఆధునిక వ్యవస్థలు ఈ డ్రోన్లో ఉన్నాయి. సరిహద్దుల్లో పహారా కోసం భారత్ దీనిని వినియోగిస్తోంది. తాజా ఘటనతో భారత్ చేతిలోని అత్యాధునిక టెక్నాలజీ చైనా పాలైనట్లు అనుమానించాల్సి వస్తోంది.
సాంకేతికతను తస్కరించే యత్నమా?
భారత్ ఇంతగా ఆందోళన చెందడానికి కూడా కారణముంది. సాంకేతిక పరిజ్ఞానం చౌర్యానికి చైనా పెట్టింది పేరు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా నుంచి రక్షణ సమాచారాన్ని హ్యాక్ చేసి ఆ సమాచారంతో డ్రాగన్ కంట్రీ యద్ధ విమానాలను తయారు చేస్తోంది. తాజాగా మన దేశం నుంచి డ్రోన్ను చేజిక్కించుకోవడంతో.. దాని సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దొంగిలిస్తుందేమో అని మన దేశ మిలిటరీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిన్న పొరపాటుకు భారీ మూల్యమా?
భారత సాయుధ దళాలు 2000 సంవత్సరం నుంచి ఈ రకం డ్రోన్లను వినియోగిస్తున్నాయి. భారత పదాతి దళం దాదాపు 45 డ్రోన్లను వినియోగిస్తోంది. భారత్ భూభాగంలోని సిక్కిం సెక్టర్లో జరుగుతున్న ఒక శిక్షణ కార్యక్రమం సందర్భంగా చోటు చేసుకున్న చిన్న పొరపాటు వల్ల డ్రోన్ భారత సరిహద్దును దాటినట్లు అధికారులు చెబుతున్నారు. నిజానికి ఈ పరిణామంతో భారత అధికారులు కూడా కంగుతిన్నారు.