మళ్లీ మన పైనే నింద... రాజ్నాథ్తో భేటీలో చైనా దుందుడుకు వ్యాఖ్యలు... తిప్పికొట్టిన భారత్...
మాటల్లోనూ,చేతల్లోనూ చైనా దుందుడుకు వైఖరి నానాటికీ రెట్టింపు అవుతూ వస్తుందే తప్ప తగ్గట్లేదు. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసి మరోసారి సరిహద్దు ఉద్రిక్తతలకు కారణమైన డ్రాగన్... భారత్నే దబాయించే ప్రయత్నం చేస్తోంది. తాజా ఉద్రిక్తతలకు పూర్తి బాధ్యత భారత్దే అని చైనా వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. రష్యాలోని మాస్కో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సులో జరిగిన ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రుల భేటీలో చైనా భారత్ను నిందించే ప్రయత్నం చేసింది.
చైనా రక్షణ మంత్రితో ఫేస్ టు ఫేస్ - డ్రాగన్ తీరును ఏకిపారేసిన రాజ్నాథ్ - అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా
భారత్పై నింద...
సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సులో భారత్-చైనా రక్షణశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్, వి పెంఝీ సమావేశమైన సంగతి తెలిసిందే. చైనా ప్రతిపాదన మేరకే ఈ భేటీ జరిగింది. మే నెల నుంచి భారత్-చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ఈ భేటీ వి ఫెంఝీ మాట్లాడుతూ... సరిహద్దు ఉద్రిక్తతలతో రెండు దేశాల మధ్య సంబంధాలు,రెండు దేశాల మిలటరీ తీవ్రంగా ప్రభావితం అవుతోందన్నారు. ఈ పరిస్థితులకు కారణమేంటో స్పష్టంగా కనిపిస్తూనే ఉందని... దీనికి భారతే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.
వి పెంఝీ ఏమన్నారు...
'చైనా భూభాగంలో ఒక్క అంగుళాన్ని కూడా వదులుకునేది లేదు. జాతీయ సార్వభౌమత్వాన్ని,ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు చైనా సైన్యం పూర్తిస్థాయి శక్తియుక్తులతో ఉన్నది. ఇరు దేశాల అధినేతలు జిన్పింగ్,మోదీల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరువైపులా నిజాయితీగా అమలుచేయాలి. సంప్రదింపులు చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. వాస్తవాధీన రేఖ వెంబడి ఫ్రంట్ లైన్లో ఉండే బలగాలపై నియంత్రణను బలోపేతం చేయాలి. ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులను నియంత్రించగలగాలి. అలాగే ప్రతికూల సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా హైప్ చేసి ఉద్రిక్తతలకు తావు ఇవ్వవద్దు.' అని వి పెంఝీ రాజ్నాథ్ సింగ్తో పేర్కొన్నారు.
చైనా విమర్శలను తిప్పికొట్టిన భారత్...
తాజా సరిహద్దు ఉద్రిక్తతలకు పూర్తి బాధ్యత భారత్దే అన్న చైనా వ్యాఖ్యలను భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొట్టిపారేశారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) దుందుడుకు చర్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. 'బాధ్యతాయుతమైన వైఖరిని అవలంబించండి.వీలైనంత త్వరగా ఫ్రంట్-లైన్ శక్తులను పూర్తిగా వెనక్కి రప్పించండి. పరిస్థితిని తీవ్రతరం చేసే లేదా క్లిష్టతరం చేసే చర్యలను ఇకనైనా ఆపేయండి. ద్వైపాక్షిక సైనిక సంబంధాలను వీలైనంత త్వరగా సరైన మార్గంలోకి తీసుకురావడానికి విబేధాలను వివాదాలుగా మార్చకుండా చూడండి.' అని చైనాకు రాజ్నాథ్ సింగ్ సూచించారు.
Recommended Video
చైనా వల్లే ఉద్రిక్తతలు...
జూన్ 15న భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైన్యం మధ్య తలెత్తిన ఘర్షణ తర్వాత పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైన్యాన్ని వెనక్కి రప్పించేందుకు మిలటరీ స్థాయి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సైన్యం ఉపసంహరణకు ఇరు దేశాలు ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా కుదర్చుకున్నాయి. అయితే చైనా మాత్రం ఆ ఒప్పందాలను ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు దక్షిణ తీరాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసి మరోసారి ఉద్రిక్తతలకు కారణమైంది.