భారత్ను దెబ్బ తీసేందుకు ఒక్కటైన చైనా నేపాల్: కీలక రంగాల్లో పరస్పర అంగీకారంకు ఓకే..!
ప్రస్తుతం భారత్తో నెలకొన్న విబేధాల నేపథ్యంలో భారత్ను ఇతర దేశాలకు దూరం చేయాలనే కుటిల ప్రయత్నానికి చైనా తెరదీసింది. ఇందులో భాగంగానే భారత్తో నిన్న మొన్నటి వరకు మిత్రదేశాలుగా మెలిగిన పలు దేశాలకు డ్రాగన్ కంట్రీ ఎరవేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ నేపాల్ సరిహద్దు వివాదం ఎప్పుడూ లేనంతగా ఒక్కసారి తెరపైకి వచ్చింది. నేపాల్ లేవనెత్తిన సరిహద్దు వివాదం వెనక డ్రాగన్ కంట్రీ హస్తం ఉందనేది తేటతెల్లమైంది. తాజాగా నేపాల్ చైనా దేశాలు ఒకరికొకరు కలిసి పనిచేస్తాయని ప్రతిజ్ఞ చేశాయి.
Recommended Video
1000 కోట్ల స్కాం: చైనా జాతీయుడు అరెస్ట్, అన్ని నకిలీవే, భారత యువతిని మోసం చేసి పెళ్లి
పరస్పర సహకారంకు ఓకే చెప్పిన చైనా నేపాల్
చైనా నేపాల్ దేశాల మధ్య స్నేహబంధం మరింత పెరిగింది. కీలక రంగాల్లో రెండు దేశాలకు ప్రయోజనాలు కలిగేలా కలిసి పనిచేయాలనే ఒక అంగీకారంకు రెండు దేశాలు వచ్చాయి. అంతేకాదు ప్రాంతీయ వ్యవహారాలపై కూడా ఒకరికొకరు కలిసి పయనించాలని భావిస్తున్నాయి . ఇందులో భాగంగానే చైనా నేపాల్ దేశాల విదేశీ వ్యవహారాల శాఖల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైనా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను ముందుకు తీసుకెళ్లడంలో ఒకరి సహకారం మరొకరికి ఉంటుందని రెండు దేశాలు అంగీకారం తెలిపాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా క్రాస్ బార్డర్ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుంది. ఈ మేరకు చైనా విదేశీ వ్యవహారాల శాఖ డిప్యూటీ మంత్రి లూజావ్హూ నేపాల్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి శంకర్ దాస్ బైరాగితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
చైనా విధానాలకు నేపాల్ మద్దతు
ఇరు దేశాల మధ్య 13వ దౌత్యపరమైన చర్చలు జరిగాయని రెండు దేశాలు ఇకనుంచి కీలక రంగాల్లో ఒకరికొకరం సహకరించుకునేందుకు అంగీకారం తెలిపాయని లూజావ్హూ చెప్పారు. అంతేకాదు జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో కూడా ఒకరికొకరం సహకరించుకుని బంధాన్ని బలోపేతం చేసుకుంటామని చెప్పారు. తైవాన్, టిబెట్ , హాంకాంగ్ అంశాల్లో చైనాకు నేపాల్ అండగా ఉంటుందని అదే సమయంలో చైనా తీసుకొచ్చిన విధానాలకు పూర్తి మద్దతు తెలుపుతోందని నేపాల్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి బైరాగి చెప్పారు. ఇక సమావేశం తర్వాత ఇరు దేశాల మధ్య అభినందన కార్యక్రమం జరిగింది. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
రెండు దేశాలు చర్చలు జరిపినంత మాత్రానా...
చైనా నేపాల్ దేశాల మధ్య ఎప్పుడూ పరస్పర సహకారాలు కొనసాగాయని రెండు దేశాలు ఒకరినొకరు సమానత్వంతో మెలుగుతాయని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గత నెలలో నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారీకి పంపిన లేఖలో పేర్కొన్నారు. గతనెలలో ఇరుదేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే చైనా నేపాల్ దేశాల సమావేశంతో భారత్ నేపాల్ దేశాల మధ్య సత్సంబంధాలు తెగిపోతాయని అనుకోకూడదని భారత్లో నేపాల్ అంబాసిడర్ నీలాంబర్ ఆచార్య చెప్పారు.
వివాదం అక్కడి నుంచే..
ప్రస్తుతం కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో పొరుగుదేశాల వారిగా ఒకరికొకరం సహకరించుకోవడంపై దృష్టి సారించాలని చెప్పారు. ఇతర విషయాలను పట్టించుకోనక్కర్లేదని ఆచార్య చెప్పారు. ఇదిలా ఉంటే భారత్ నేపాల్ దేశాల మధ్య సత్సంబంధాలపై నీలిమేఘాలు అలుముకుంటున్నాయి. వివాదాస్పద భూభాగంను నేపాల్ తమ దేశంలో కలిపేసుకుని కొత్త మ్యాప్ను విడుదల చేయడంతో వివాదానికి తెరలేసింది. ఈ క్రమంలోనే నేపాల్ ప్రధాని ఓలి శర్మ చైనాకు దగ్గరయ్యారు. అంతేకాదు నేపాల్ -టిబెట్ ప్రాంతంలో క్రాస్ బార్డర్ రైల్వే ప్రాజెక్టుకు సహకరించారు.