ఇండియాపై చైనా, పాక్ ల భారీ కుట్ర..ఉగ్రవాదుల ఆయుధాలపై చైనా గుర్తులతో బయటపడిందిలా !!
ఇండియా, చైనా సరిహద్దు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో చైనా, పాకిస్థాన్ కలిసి ఇండియాపై కుట్రలు చేస్తున్నాయని తాజా పరిణామాల ద్వారా అర్థమవుతుంది. అంతేకాదు చైనా, పాకిస్తాన్ ఐఎస్ ఐ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ వారిని భారత్లోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని, భారత్లో విధ్వంసాలు సృష్టించాలని కుట్రలు పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
భారీగా ఉగ్రవాదుల చొరబాటు .. పాక్ చైనా కుట్రలో భాగం
జమ్మూకాశ్మీర్లో భారత వ్యతిరేక కార్యకలాపాలను పెద్ద ఎత్తున సాగించాలని, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రహస్యంగా చేరవేయాలని ప్రయత్నం చేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. అయితే ఈ ఉగ్రవాద సంస్థల వెనుక ఇండియాకు బద్ధ శత్రువులైన పాకిస్తాన్, చైనా ఉన్నట్లుగా సమాచారం. డ్రాగన్ దేశమైన చైనా ఆదేశాల మేరకు పాకిస్తాన్ , తమ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ కి ఇండియాలోకి చొరబడాలని, దాడులకు పాల్పడాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
లడఖ్ లో ప్రతిష్టంభన ... ఇదే సమయంగా జమ్మూ కాశ్మీర్ లోకి చొరబాట్లు
లడక్ లోని వాస్తవాధీన రేఖ వెంట చైనా దుందుడుకు చర్యలతో భారత దళాలు దృష్టి సారించిన సమయంలో, భారత భూభాగంలోకి జమ్ము కాశ్మీర్ నియంత్రణ రేఖ ద్వారా 400 మంది ఉగ్రవాదులను పంపించాలని ప్రయత్నం చేసింది పాకిస్తాన్. ఈ క్రమంలోనే కాశ్మీర్ లోయ ద్వారా ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడుతున్నారు. పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా తరలించే యత్నం చేస్తున్నారు. దీంతో భారత భద్రతా దళాలు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చొరబాటు నిరోధక గ్రిడ్ ను మరింత బలోపేతం చేశాయి .
ఇండియా టార్గెట్ గా ఉగ్రదాడులకు యత్నం ... ఉగ్రవాదుల ఆయుధాలపై చైనా గుర్తులు
జమ్మూకాశ్మీర్లో అస్థిరతను సృష్టించడం కోసం చైనా పాకిస్థాన్ లు కలిసి పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు ప్లాన్ చేసి ఉగ్రవాదులను పంపే ప్రయత్నం చేస్తున్నాయని గుర్తించిన ఇండియన్ ఆర్మీ జమ్ము కాశ్మీర్ వాస్తవాధీన రేఖపై దృష్టి పెట్టింది. ఇటీవల జమ్మూకాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న ఆయుధాలపై చైనా దేశానికి సంబంధించిన గుర్తులు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. పెద్ద ఎత్తున ఉగ్రవాదుల చొరబాట్లకు యత్నించటం, ఆయుధాలు తరలించడం పాకిస్తాన్ చైనా ల కుట్రగా నిర్ధారించుకున్నారు అధికారులు.
ఆయుధాల చేరవేత యత్నం .. ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భారత్ ఆర్మీ
2 రోజుల క్రితం పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా ఆయుధ సామాగ్రిని జమ్మూకాశ్మీర్లో జార విడిచారు. పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా జారవిడిచిన వాటిలో ఉన్న అస్టాల్ రైఫిల్స్, తూటాలు, మ్యాగజైన్స్ స్వాధీనం చేసుకున్న ఆర్మీ అవి మేడ్ ఇన్ చైనా అని గుర్తించారు. ఇదే సమయంలో జమ్ము నుండి దక్షిణ కాశ్మీర్ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసిన భద్రతా దళాలు వారి వద్ద కూడా చైనా గుర్తులు ఉన్న ఆయుధాలను , మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద చైనా గుర్తులు ఉన్న నోరిన్కో, మూడు గ్రనైడ్లు , రైఫిళ్లు, ఏకే-47 రైఫిల్ లను స్వాధీనం చేసుకున్నారు.
చైనా పాక్ కుట్ర భగ్నం చేసే పనిలో ఇండియన్ ఆర్మీ
గత పది రోజులుగా వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న తాజా పరిస్థితులను ఆర్మీ చీఫ్ నరవాణే, బీఎస్ఎఫ్ చీఫ్ రాకేష్ ఆస్థాన, సిఆర్పిఎఫ్ అధికారి ఏపీ మహేశ్వరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాలలో చొరబడడం, తాజాగా ఉగ్రవాదుల నుండి స్వాధీనం చేసుకున్న పలు ఆయుధాల పై చైనా మేడ్ మార్కింగ్ ఉండడం వంటి అంశాలు రెండు దేశాల కుట్రను బహిర్గతం చేస్తున్నాయి. చైనా, పాకిస్థాన్ లో కుట్ర ను భగ్నం చేయడానికి ఇండియన్ ఆర్మీ రంగం లోకి దిగింది. అందులో భాగంగానే జమ్ముకశ్మీర్లో టెర్రరిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.