చైనా ఎంతకు తెగించింది? భారత్ను రెచ్చగొట్టేలా మరో దుశ్చర్య..
చైనా, టిబెట్, రోమన్ లిపిలోని అక్షరాలతో ఈ పేర్లను ప్రామాణికరించారు. వొగ్యలిన్ లింగ్, మిలా రీ, ఖ్యోడెన్ గార్బో, మాణిఖ్యా, బుమొలా, నామ కాపబ్ రీ అనే పేర్లను పెట్టారు.
బీజింగ్: చాలాకాలంగా భారత్లోని అరుణాచల్ ప్రదేశ్పై కన్నేసిన చైనా ఈమధ్య కాలంలో మరీ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. అప్పట్లో అరుణాచల్ ప్రదేశ్ను తమ భూభాగంలో ఉన్నట్లు చూపించి విమర్శలపాలైన చైనా.. తాజాగా ఆ ప్రాంతానికి వేరే పేరును ప్రామాణీకరించే దుశ్చర్యకు పాల్పడింది.
అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్గా పేర్కొంటూ భారత్ లోని భూభాగంపై ఆధిపత్యం చలాయించే ప్రయత్నం చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా పేర్కొంటూ ఏప్రిల్ 14న అక్కడి పౌర వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు చైనా మీడియా వెల్లడించింది.
టిబెట్ బౌద్ద మత గురువు దలైలామా అరుణాచల్ లో పర్యటించడాన్ని నిరసిస్తూ భారత విదేశీ వ్యవహారాల అధికారికి సమన్లు పంపించిన 9రోజుల తర్వాత చైనా ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. దక్షిణ టిబెట్ లో భౌగోళిక సార్వభౌమత్వాన్ని పునరుద్ఘాటించేలా అరుణాచల్ ప్రదేశ్ లోని 6 ప్రాంతాలకు కొత్త పేర్లు ప్రామాణికరించినట్లుగా చైనీయులు చెబుతున్నారు.
చైనా, టిబెట్, రోమన్ లిపిలోని అక్షరాలతో ఈ పేర్లను ప్రామాణికరించారు. వొగ్యలిన్ లింగ్, మిలా రీ, ఖ్యోడెన్ గార్బో, మాణిఖ్యా, బుమొలా, నామ కాపబ్ రీ అనే పేర్లను పెట్టారు. అయితే ఇదంతా కుట్రపూరితం అని టిబెట్ వాదిస్తోంది. వీటిని ప్రామాణికరించలేదని, ఈ పేర్లు పూర్వ కాలం నుంచే ఉన్నాయని టిబెట్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ పరిశోధకుడు గుయె కెఫాన్ తెలిపారు.
కాగా, చైనా-భారత్ మధ్య 3,488కి.మీ మేర వాస్తవాధీన రేఖ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించుకోవడానికి చాలాకాలంగా చైనా ప్రయత్నిస్తోంది. 1962 యుద్ద సమయంలోను కొన్ని ప్రాంతాలను డ్రాగన్ ఆక్రమించుకుంది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య 19సార్లు ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. తాజాగా దలైలామా పర్యటన నేపథ్యంలో చైనా మరోసారి దుశ్చర్యకు దిగింది.