డోక్లాం దురాక్రమణకు చైనా మరో ప్లాన్... వక్రబుద్ది మరోసారి బట్టబయలు... వెనక్కి తగ్గినట్లే తగ్గి...
మూడేళ్ల క్రితం డోక్లాం భూభాగాన్ని ఆక్రమించి రోడ్డు నిర్మాణానికి విఫలయత్నం చేసిన చైనా.. ఈసారి దొడ్డిదారిన తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. అక్రమ సొరంగ మార్గం ద్వారా డోక్లాం పీఠభూమిలోకి ప్రవేశించి రోడ్డు నిర్మాణ పనులు చక్కబెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం మెరుగ్ లా పాస్ వైపు నుంచి డోక్లాం పీఠభూమిలోకి సొరంగం మార్గం నిర్మిస్తోంది. తద్వారా చలికాలంలో సైతం డోక్లాంలో తమ బలగాలను మోహరించడానికి... అక్కడ నిర్మాణ పనులను చేపట్టడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
సొరంగ మార్గాన్ని విస్తరిస్తున్న చైనా...
డోక్లాం పీఠభూమిలో అక్రమంగా చొరబడేందుకు చైనా సొరంగ మార్గాన్ని చేపట్టినట్లు ప్రముఖ జాతీయ మీడియా కొన్ని శాటిలైట్ చిత్రాలను బయటపెట్టింది. డోక్లాంకు ఉత్తరాన అధిక ఎత్తులో ఉన్న మెరుగ్ లా వైపు నుంచి అక్కడికి చేరుకునేలా సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నట్లు ఆ శాటిలైట్ చిత్రంలో కనిపిస్తోంది. అగస్టు 2019 నాటి శాటిలైట్ చిత్రంతో ఈ విషయం వెల్లడవగా... ఆ తర్వాత అక్టోబర్లో వెలుగుచూసిన మరో శాటిలైట్ చిత్రంలో చైనీస్ వర్కర్స్... ఆ సొరంగ మార్గాన్ని 500మీ. మేర విస్తరించినట్లు తేలింది.
దురాక్రమణ వ్యూహమే...
ఏ ప్రయోజనాలను ఆశించి చైనా ఈ నిర్మాణాన్ని చేపడుతుందో క్లియర్గా కనిపిస్తూనే ఉందని భారత ఆర్మీ నిపుణులు పేర్కొంటున్నారు. ఏ సీజన్లో అయినా సరే డోక్లాంలో ప్రవేశానికి వీలుగా చైనా సొరంగ మార్గం నిర్మిస్తోందన్నారు. ముఖ్యంగా చలికాలంలో అక్కడ కురిసే దట్టమైన మంచు కారణంగా రాకపోకలకు అవకాశం ఉండదు కాబట్టి... సొరంగ మార్గం ద్వారా చేరుకోవాలనేది చైనా ప్లాన్ అని చెప్తున్నారు. నిజానికి 2017లో దాదాపు 73 రోజుల ప్రతిష్టంభన తర్వాత చైనా డోక్లాం నుంచి వెనక్కి తగ్గింది. అయితే ఆ వెనుకడగు తాత్కాలికమే అన్నది అక్కడ సొరంగ నిర్మాణ పనులను చూస్తే అర్థమవుతోంది.
వెనక్కి తగ్గినట్లే తగ్గి...
భారత్-చైనా-భూటాన్ సరిహద్దులో ఉన్న డోక్లాం భూభాగంపై 2017లో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. నిజానికి ఇది భూటాన్ భూభాగం కాగా... చైనా అది తమదేనని వాదిస్తోంది. అంతేకాదు,సైన్యాన్ని మోహరించి రోడ్డు నిర్మాణం కూడా మొదలుపెట్టింది. అయితే భారత బలగాలు రంగంలోకి దిగి చైనాను అడ్డుకోవడంతో అక్కడ డ్రాగన్ ఆటలు సాగలేదు. భూటాన్కు మద్దతుగా భారత్ అక్కడ చైనాను గట్టిగా నిలువరించింది. ఒకానొక దశలో భారత్-చైనా మధ్య ఇది యుద్దానికి దారితీస్తుందా అన్న రీతిలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు సుదీర్ఘ ప్రతిష్టంభన తర్వాత అక్కడ ఇరు దేశాలు సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. అప్పటి పరిస్థితుల్లో తాత్కాలికంగా అక్కడినుంచి తప్పుకున్నప్పటికీ.. చైనా ఇప్పటికీ డోక్లాంను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కుటిల ఎత్తుగడలు వేస్తూనే ఉంది.