చైనాలో 10 రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రి.. మరి ఇండియా సంగతేంటి.. ఇదిగో..
కరోనా వైరస్ నియంత్రణ కోసం చైనా ఎంతలా పోరాడిందో.. ఇంకా పోరాడుతుందో చూస్తూనే ఉన్నాం. కేవలం 10 రోజుల వ్యవధిలో వుహాన్లోని హౌషెన్షన్లో అధునాతన 1000 పడకల ఆసుపత్రిని నిర్మిస్తే.. చైనా సత్తాకు ప్రపంచమే ఆశ్చర్యపోయింది. దాదాపు 7500 మంది భవన నిర్మాణ కార్మికులు ఇందుకోసం పనిచేశారు. ఈ క్రమంలో మూడు రోజులకొకసారి కేవలం రెండు గంటలు మాత్రమే వారు నిద్రపోయినట్టు సీజీఎన్టీ న్యూస్ చానెల్ వెల్లడించింది.
ఒక్క హౌషెన్షన్ మాత్రమే కాదు.. లీయిషెన్షన్లోనూ 1600 పడకలతో ఇలాంటి మరో ఎమర్జెన్సీ ఆసుపత్రిని నిర్మించింది. ఇదంతా చూసి చాలామంది భారతీయులు.. భారత్లో ఇలాంటి చర్యలు సాధ్యమేనా అనుకున్నారు. చైనాలో లాగే భారత్లోనూ ఒక్కసారిగా కరోనా విజృంభిస్తే మన హెల్త్ కేర్ వ్యవస్థ,ఆసుపత్రులు సరిపోతాయా అన్న ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో పలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన కేంద్రం.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
రైలు కోచ్లలో ఐసోలేషన్ వార్డులు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా రైళ్లల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసి గ్రామీణ,మారుమూల ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రైల్వే మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీల్లోనే వెంటిలేటర్లు కూడా తయారుచేయాలని నిర్ణయించింది. పంజాబ్లోని కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ(RCF)కి ఎల్హెచ్బి(Linke Hofmann Busch) ప్యాసింజర్ కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా తయారుచేసే బాధ్యతను అప్పగించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ICF)లో ట్రైన్-18 రూపకర్తలు వెంటిలేటర్లను తయారుచేయనున్నారు.
పీయుష్ గోయల్ ఏమన్నారు..
కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ నియంత్రణ కోసం భారత్ సిద్దం కావాల్సిన అవసరం ఉందని బుధవారం(మార్చి 25)న రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్తో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్లో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గ్రామీణ,మారుమూల ప్రాంతాల్లో వైద్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదే విషయంపై పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ రైల్వే ఉన్నతాధికారి.. 21 రోజుల లాక్ డౌన్ను మించి కరోనాపై సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుందని.. ఇందుకోసం తాము సంసిద్దమవుతున్నామని తెలిపారు.
కపుర్తాలలో మొదలైన పని..
ఆర్సీఎఫ్ కపుర్తాలా ఇప్పటికే ఉన్న ఎల్హెచ్బి కోచ్ను ఐసోలేషన్ వార్డుగా మలిచే పనులు మొదలయ్యాయి.ఇందులో భాగంగా మొదట ఒక నమూనాను తయారు చేయనున్నారు. ఇది నాన్-ఏసి కోచ్. ఎందుకంటే ఏసీ కోచ్లో గాలిని శుభ్రపరచడం కష్టం. ఇక్కడ ఐసోలేషన్ వార్డుకు సంబంధించిన లేఅవుట్ సిద్ధమయ్యాక.. ఒక్క కోచ్లో ఎంత మంది రోగులకు వసతి కల్పించాలి అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. పరిశుభ్రత,డిస్టెన్స్,ఆరోగ్య పర్యవేక్షణకు అవసరమైన మెడికల్ పరికరాలు,ప్రత్యేక బాత్రూమ్ సదుపాయాలు.. వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని దాన్ని నిర్ణయించనున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్యాసింజర్ రైళ్లన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఒక్కసారి డిజైన్ సిద్దమైందంటే.. కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మలచడం పెద్ద పనేమీ కాదని అధికారులు అంటున్నారు.
Recommended Video
ఇండియాలో ఎన్ని వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి..
అయితే వెంటిలేటర్ల తయారీ మాత్రం సవాల్తో కూడుకున్నదేనని అధికారులు చెబుతున్నారు. చెన్నైలోని ఐసీఎఫ్లో 'రివర్స్ ఇంజనీరింగ్'ని ఉపయోగించి ఒక నమూనాను తయారుచేసినప్పటికీ.. అది విఫలమైంది. ఇందుకోసం ప్రస్తుతం అక్కడ మరిన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానికి వెంటిలేటర్ మెషీన్ను తయారుచేయడం కష్టమేమీ కాదని.. కానీ దాని ప్రమాణాలను నిర్దేశించడమే కష్టతరమని అధికారులు చెబుతున్నారు. యాంత్రిక వెంటిలేటర్లకు కాలం చెల్లిపోయిందని.. మనం తయారుచేయబోయే వెంటిలేటర్లు ప్రస్తుత ప్రమాణఆలకు అనుగుణంగా ఉండాలని అంటున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్న దానిపై అధికారిక లెక్కలేవి అందుబాటులో లేవు. ఒక అంచనా ప్రకారం సుమారు 40వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే వెంటిలేటర్ల తయారీపై కేంద్రం ప్రత్యేకే ఫోకస్ పెట్టింది.