అమెరికాపై వాణిజ్య యుద్ధానికి భారత్ కలిసి రావాలి: చైనా
న్యూఢిల్లీ: అమెరికా ప్రపంచ వాణిజ్య రంగంపై ఏకపక్షధోరణితో వ్యవహరిస్తోందని చైనా ధ్వజమెత్తింది. అమెరికాపై పోరాడేందుకు భారత్ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చింది. జాతీయ భద్రత పేరుతో వాణిజ్యరంగంపై అమెరికా ఆంక్షలు విధించడం సరికాదన్న చైనా... ఈ వైఖరితో చైనా ఆర్థికాభివృద్ధిపై ప్రభావం పడటమే కాక చైనా భారత్ల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా దెబ్బతింటాయని చైనా అభిప్రాయపడింది.
చైనా భారత్ దేశాలు అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశాలని, వాణిజ్యపరంగా కూడా ఎదుగుతున్న దేశాలని కౌన్సిలర్ జీరాంగ్ అన్నారు. ఈ సమయంలో బాహ్యవాతావరణం మెరుగ్గా ఉంటేనే సంబంధాలు బలంగా కొనసాగుతాయని అమెరికా లాంటి దేశాలు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తే సంబంధాలు దెబ్బతిని అభివృద్ధి ఆగిపోతుందన్నారు.
గతేడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 200 బిలియన్ అమెరికన్ డాలర్లు సుంకం విధించారు. దీనికి ప్రతీకార చర్యగా చైనాలోకి దిగుమతి అవుతున్న అమెరికా వస్తువులపై డ్రాగన్ కంట్రీ 60 బిలియన్ అమెరికా డాలర్లు సుంకం విధించింది. చైనా మరో సారి ఇలాంటి చర్యలకు పాల్పడితే అదనంగా 260 బిలియన్ అమెరికా డాలర్లు సుంకంగా విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఈ క్రమంలోనే అమెరికాపై పోరు సాగించేందుకు చైనా భారత్లు కలిసి పనిచేయాలని జీరాంగ్ చెప్పారు.
ప్రాంతీయ అభివృద్ధి కోసం సహకరించేందుకు చైనా ఎప్పుడూ సిద్దంగా ఉంటుందన్నారు జీరాంగ్, అయితే చైనాను టార్గెట్ చేసేందుకు ఇండో పెసఫిక్ స్ట్రాటజీ పేరుతో ఆయుధాన్ని వినియోగించడం చైనా వ్యతిరేకిస్తోందన్నారు. అభివృద్ధి వైపు నడుస్తున్న దేశాలకు అమెరికా అండగా నిలువాలని చైనా ఆకాంక్షిస్తున్నట్లు జీరాంగ్ తెలిపారు.