పాక్కు మరోసారి చైనా మద్దతు, టెర్రరిజం అదుపుకు సహకరించాలి
బీజింగ్: పాక్ను మరోసారి చైనా మద్దతు ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్కు సహకరించాలని చైనా పిలుపు ఇచ్చింది.ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ను ఉగ్రవాద ఎగుమతి ఫ్యాక్టరీగా అభివర్ణించిన మరునాడే చైనా పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
ఫాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) భేటీకి ఒకరోజు ముందు చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ భేటీకి భారత్, పాక్ విదేశాంగ మంత్రులు హాజరవుతున్నారు.పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేయడంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హు చున్యంగ్ స్పందించారు.
ఉగ్రవాదం ప్రపంచానికి శత్రువులా పరిణమించిందని ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అంతర్జాతీయ సమాజం పాక్కు వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. ఎస్సీఓ భేటీలోనూ ఉగ్రవాద సంబంధిత అంశాలు చర్చకు రానున్నాయని చెప్పారు. ఉగ్రవాద సంబంధిత అంశాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకుంటామని వ్యాఖ్యానించారు. .
పాకిస్తాన్కు పలు అంశాల్లో చైనా మద్దతుగా నిలుస్తున్న ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఈ తరుణంలో తాజాగా ఈ వ్యాఖ్యలు మరోసారి కలకలానికి కారణమయ్యాయి. అయితే ఉగ్రవాదాన్ని పాక్ పెంచిపోషిస్తోందనే నెపంతోనే అమెరికా పాక్కు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని కూడ నిలిపివేసింది.