గాల్వాన్ వ్యాలీ నుంచి చైనా, భారత్ భద్రతా దళాలు వెనక్కి, శాంతినే కోరుకుంటున్నాం: విదేశాంగశాఖ
తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, భారత జవాన్లకు మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఆ ప్రాంతాన్ని వారు వదిలి వెళ్లిపోయారని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఘర్షణతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో.. ఆ ప్రాంగణాన్ని ఇరుదేశాల సిబ్బంది వదిలివెళ్లారని పేర్కొన్నది.
ఈ అంశంపై ఇరుదేశాలు సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చిస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరుదేశాలు ముందుజాగ్రత్త చర్య తీసుకున్నాయి. అయితే సీనియర్ కమాండర్లు ఈ నెల 6వ తేదీన చర్చలు జరిపి, ఒక ప్రక్రియపై అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. సమస్యపై ఏకాభిప్రాయం కోసం వరుస సమావేశాలు జరిగాయని వివరించారు.
చైనాతో ఏర్పడిన సమస్య సున్నితంగా ముగుస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గాల్వాన్ యథాతథంగా ఉంచాలని భారత్ కోరగా, అందుకు నిరాకరించడంతోనే సోమవారం ఘర్షణ జరిగిందని వివరించారు. ఇరువైపులా ప్రాణనష్టం జరిగిందని అంగీకరించారు. తమ కార్యకలాపాలన్నీ ఎల్ఏసీ వెలుపల ఉన్నాయని, ఈ విషయాన్ని చైనా కూడా అంగీకరిస్తోందని ఆశిస్తున్నామని తెలిపారు.
సరిహద్దు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని, సమస్యలపై చర్చించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నామని నొక్కి వక్కానించారు.