భారత్ టార్గెట్గా చైనా మరో కుట్ర- హిందూ మహాసముద్రంలో భారీగా నీటి డ్రోన్లు
భారత్, చైనాతో పాటు మరెన్నో దేశాలకు కీలకమైన హిందూ మహాసముద్రంపై పట్టు కోసం దశాబ్దాలుగా చాలా ప్రయత్నాలు జరిగాయి. తాజాగా ప్రపంచ వాణిజ్య శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న చైనా హిందూ మహాసముద్రంపై తనకు పూర్తి పట్టు ఉండాలని భావిస్తోంది. దీంతో భారత్తో రేపు యుద్ధం చేయాల్సి వచ్చినా, చుట్టుపక్కల ఇతర దేశాలపై నియంత్రణ సాధించాలన్నా హిందూ మహాసముద్రం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో చైనా హిందూ మహాసముద్రంలో నెలల తరబడి పనిచేసేలా నీటి డ్రోన్లను మోహరించినట్లు వెల్లడైంది.
ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్కు రాసిన వ్యాసంలో అమెరికా రక్షణ నిపుణుడు హై సట్టన్ పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇవన్నీ నిశితంగా గమనిస్తే చైనా కుట్రలు తేటతెల్లమవుతాయి. నీటిలో నెలల తరబడి పనిచేస్తూ ఈ సముద్రంపై సాగే ఇతర దేశాల నౌకాదళాలు, కోస్ట్ గార్డుల కదలికలను గుర్తించేందుకు యూయూవీ ( అన్క్రూడ్ అండర్ వాటర్ వెహికల్)గా పిలిచే మానవ రహిత డ్రోన్లను మోహరించినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా హిందూ మహాసముద్రంలో జరిగిన పరిశోధనల్లో గతేడాది డిసెంబర్ నుంచి వీటిని మోహరించినట్లు స్పష్టమైంది. అంటే సరిహద్దుల్లో భారత్-చైనా ఘర్షణలు మొదలయ్యాక వీటిని అక్కడికి పంపారు.
గతంలో అమెరికా సర్కారు సముద్ర జలాల్లో మోహరించిన ఇలాంటి గ్లైడర్లను చైనా స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ నిపుణుడు సట్టన్ వెల్లడించారు. ఇప్పుడు అలాంటి వాటినే చైనా హిందూ మహాసముద్రంలో మోహరించిందన్నారు. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, గత ఏడాది డిసెంబర్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం హిందూ మహాసముద్రం మిషన్లో 14 డ్రోన్లు వాడాలని నిర్ణయించినా.. 12 మాత్రమే వాడుతున్నట్లు తేలింది. ఈ గ్లైడర్లు పెద్ద రెక్కలతో గ్లైడ్ చేయటానికి ఎక్కువ కాలం పనిచేయగలవని సుట్టన్ చెప్పారు, అవి వేగంగా లేదా చురుగ్గా పనిచేయలేవని తెలిపారు. అయినా సుదూర మిషన్ల కోసం వీటిని వాడుతున్నట్లు తేలింది.
హిందూ మహాసముద్రంలో ఉంచిన ఈ చైనీస్ గ్లైడర్లు సముద్ర శాస్త్ర డేటాను సేకరిస్తున్నట్లు తెలిసింది, ఇది "హానికరం కానిది" అయినప్పటికీ, సాధారణంగా నావికాదళ ఇంటెలిజెన్స్ ప్రయోజనాల కోసం సేకరిస్తారని వెల్లడైంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న సవాళ్లను గమనించిన చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈ నెల ఆరంభంలో హిందూ మహాసముద్రం (ఐఓఆర్) లో వ్యూహాత్మక స్థావరాల కోసం ప్రపంచం పరుగెత్తుతోందని, ఇది రాబోయే కాలంలో ఈ దోరణి ఇంకా పెరుగుతుందని చెప్పారు.