సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత: వాస్తవాధీన రేఖ వెంట వెలిసిన చైనా మిలటరీ స్థావరాలు: దొంగదెబ్బ
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద సుమారు అయిదు నెలల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన చైనా.. తన దుందుడుకు చర్యలను మానుకోవట్లేదు. అదును చూసుకుని రెచ్చిపోతోంది. భారత ఆర్మీ, సరిహద్దు భద్రతా జవాన్ల దృష్టిని మరల్చి వాస్తవాధీన రేఖ వెంట భారీగా మిలటరీ శిబిరాలను నెలకొల్పింది. లఢక్ దగ్గర మొదలైన ఈ ఆర్మీ పోస్టులు, మిలటరీ శిబిరాల ఏర్పాటు అరుణాచల్ ప్రదేశ్ వరకూ కొనసాగినట్లు భారత్ గుర్తించింది. చైనాకు తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది.
కీలక ప్రాంతాల్లో చైనా ఆర్మీ స్థావరాలు..
2017లో సిక్కిం సరిహద్దుల వద్ద డోక్లాం ట్రై జంక్షన్ వివాదం, సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచే ఆర్మీ పోస్టుల ఏర్పాటు ఆరంభమైనట్లు భారత్ తాజాగా గుర్తించింది. సుమారు రెండు నెలలకు పైగా డోక్లాం ట్రై జంక్షన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు అప్పట్లో కొనసాగాయి. అదే సమయంలో- భారత్ను ఏమార్చి, దృష్టిని మరల్చి చైనా.. సైనికులు ఈ ఆర్మీ క్యాంపులను నిర్మించినట్లు భావిస్తున్నారు. ప్రాథమికంగా ఇలాంటి 20 క్యాంపులను తాము గుర్తించినట్లు రక్షణమంత్రిత్వ శాఖ అధికారులు నిర్ధారించారు.
పకడ్బందీగా ఆర్మీ క్యాంపులు..
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలతో పాటు కొంతమంది సాధారణ పౌరులు కూడా ఆ శిబిరాల వద్దకు రాకపోకలు సాగిస్తున్నట్లు పక్కా సమాచారం ఉందని పేర్కొన్నారు. భారత అధికారుల దృష్టికి రానివి మరిన్ని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సరిహద్దుల వెంట అత్యంత పకడ్బందీగా ఆర్మీ క్యాంపులను ఏర్పాటు చేసుకోవడం, ఇదివరకెప్పుడూ లేని విధంగా క్రమంగా వాటి సంఖ్యను పెంచుకుంటూ పోవడం, వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాలకు చెందని జీరో పాయింట్కు సమీపంలో వాటిని నెలకొల్పడం వంటి చర్యలు చైనా తెంపరితనాన్ని సూచిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
సడలని ఉద్రిక్తత..
సైనిక వాహనాలు సులువుగా రాకపోకలు సాగించడానికి అవసరమైన రోడ్ కనెక్టివిటీని ఆ ఆర్మీ క్యాంపులకు కల్పించినట్లు చెబుతున్నారు. మరోవంక- లఢక్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండట్లేదు. రెండు దేశాలు కూడా తమ నిఘాను మరింత ముమ్మరం చేస్తున్నాయి. సైన్యాన్ని మోహరింపజేస్తున్నాయి. అత్యంత కఠినమైన చలికాలంలోనూ సైనికుల మోహరింపు తగ్గట్లేదు. చలికాలంలో లఢక్ సరిహద్దుల్లో ఉష్ణోగ్రత జీరో స్థాయికి పడిపోతుంటుంది.
50 వేల మందికి పైగా..
అలాంటి వాతావరణంలో సుమారు 50 వేల మందికి పైగా భారత ఆర్మీ జవాన్లు లఢక్ ఈశాన్య ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వెంట పహారా కాస్తున్నారు. చైనా 60 వేల మంది సైనికులను తరలించినట్లు చెబుతున్నారు. సైనిక వాహనాలు, యుద్ధ సామాగ్రిని వెనక్కి తరలించినట్లే తరలించిన చైనా.. మళ్లీ వాటిని వెనక్కి రప్పిస్తోందని, నెలరోజుల కిందటి పరిస్థితులతో పోల్చుకుంటే..చైనా సైనికుల సంఖ్య, యుద్ధ సామాగ్రి మరింత పెరిగినట్లు భారత ఆర్మీ అధికారులు అంచనా వేస్తున్నారు.
Recommended Video
65 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం
అరుణాచల్ ప్రదేశ్ వద్ద సుదీర్ఘకాలం నుంచీ చైనా దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ 65 వేల చదరపు కిలోమీటర్ల వివాదాస్పద ప్రాంతాన్ని తనదిగా చూపిస్తోంది డ్రాగన్ కంట్రీ. అదే వైఖరిని ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తోంది. ఎవరికీ చెందని ఆ 65 వేల చదరపు కిలోమీటర్ల భూభాగంపైనే వాటిని నిర్మించింది. బమ్ లా పాస్ రహదారికి అయిదు కిలోమీటర్ల దూరంలో వేర్వేరుగా ఆ గ్రామాలను నిర్మించడం పట్ల అరుణాచల్ ప్రదేశ్ ఫ్రాంటియర్ ఆర్మీ విభాగం అధికారులు తమ అసంతృప్తిని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి తెలియజేసినట్లు ఆ వెబ్సైట్ పేర్కొంది.