భారత భూభాగంలోకి అడుగుపెట్టాయి .. అబద్దం చెప్పాల్సిన అవసరంలేదు: రాహుల్
న్యూఢిల్లీ: భారత్ -చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం, ప్రభుత్వం వాస్తవాలను దాస్తోందని, చెబుతున్న దాంట్లో స్పష్టత లేదని మొదటి నుంచి తాను చెబుతున్నానని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కచ్చితంగా చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయని ఆ విషయం తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు రాహుల్ గాంధీ. తన భవిష్యత్తు భూస్తాపితం అయినా తాను పట్టించుకోనని ఈ విషయంలో మాత్రం అబద్ధాలు చెప్పనని అన్నారు రాహుల్ గాంధీ. చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించలేదని అబద్ధం చెప్పమంటే... ఆ అబద్ధం చెప్పడం తన చేతకాదని చెప్పారు రాహుల్ గాంధీ.
సోమవారం రోజున రాహుల్ గాంధీ ప్రముఖ సోషల్ మీడియా సైట్ ట్విటర్పై ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోను పోస్టు చేశారు. చైనా బలగాలు భారత భూభాగంలోకి వచ్చాయనేదాంతో తాను పూర్తిగా కన్విన్స్ అయినట్లు చెప్పిన కాంగ్రెస్ యువరాజు... తన రాజకీయ భవిష్యత్తు పాతాళానికి తొక్కబడినప్పటికీ తాను పట్టించుకోనని చెప్పారు. రాజకీయ భవిష్యత్తు లేకపోయినప్పటికీ తానేమీ బెదరనని వెల్లడించారు. కానీ భారత భూభాగం గురించి నిజం మాత్రమే తాను చెప్పదలచుకున్నానని రాహుల్ గాంధీ వివరించారు. దేశంలో కరెంట్ అఫెయిర్స్ మరియు చరిత్ర గురించి రెండు వారాలుగా రాహుల్ గాంధీ వరస వీడియోలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పంథాలో చైనా గురించి ఓ వీడియోను పోస్టు చేశారు.
చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాయంటే తన రక్తం మరుగుతోందని చెప్పారు. ఇది తనను ఎంతగానో డిస్ట్రబ్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. మరో దేశం భారత భూభాగంలోకి వచ్చి ఆక్రమించుకుంటామని బెదిరించడమేంటని వీడియోలో ప్రశ్నించారు. ఆ మాట వింటేనే తన రక్తం మరుగుతోందని రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పటికే ఉపగ్రహం ద్వారా తీసిన ఫోటోలను పరిశీలించడం జరిగిందన్న రాహుల్ గాంధీ... ఆర్మీ మాజీ అధికారులతో భారత్ చైనా ఘర్షణపై చర్చించడం జరిగిందని చెప్పారు. చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయని తెలిసి కూడా దేశ ప్రజలను తమ అబద్ధాలుతో మభ్యపెట్టేవారికి దేశంపై భక్తి లేదని అన్నారు.
The Chinese have occupied Indian land.
— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2020
Hiding the truth and allowing them to take it is anti-national.
Bringing it to people’s attention is patriotic. pic.twitter.com/H37UZaFk1x
ఇదిలా ఉ:టే భారత్ చైనా దేశాల మధ్య గత కొద్దిరోజులుగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొంతమంది నిపుణులు చైనా బలగాలు భారత భూభాగంలోకి వచ్చాయని చెబుతుంటే భారత ప్రభుత్వం మాత్రం చైనా బలగాలు మన దేశంలోకి ఎంటర్ కాలేదని బలంగా చెబుతోంది. ఇదిలా ఉంటే సరిహద్దు దగ్గర టిబెట్, అక్సాయ్ చిన్ పర్వతాల దగ్గర పెద్ద ఎత్తున చైనా బలగాలు మోహరించి ఉన్నాయని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది.