'దక్షిణ' తీరంపై చైనా మొండిపట్టు,ఎల్ఏసీని దాటి డ్రాగన్ను బెంబేలెత్తించిన భారత్,ఒకేసారి తప్పుకునేలా..
తూర్పు లదాఖ్లోని పాంగాంగ్ సరస్సుకు దక్షిణాన ఉన్న వ్యూహాత్మక శిఖరాలపై భారత్ ఎప్పుడైతే పట్టు సాధించిందో... అప్పటినుంచి చైనా.. సైన్యం ఉపసంహరణ ప్రక్రియను పక్కనపెట్టి భారత్ను అక్కడినుంచి ఖాళీ చేయించడం పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. భారత్తో వరుసగా జరుగుతున్న మిలటరీ స్థాయి చర్చల్లో పదేపదే ఈ అంశాన్నే ప్రస్తావిస్తోంది. నిజానికి పాంగాంగ్ ఫింగర్ 4ని ఆక్రమించడమే గాక.. దక్షిణ తీరం వైపు కూడా చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడంతోనే భారత్ ముందుగా అప్రమత్తమై వ్యూహాత్మక శిఖరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. కానీ చైనా మాత్రం సైన్యం ఉపసంహరణకు ఇదే ప్రధాన అడ్డంకిగా మారినట్లు వితండ వాదన వినిపిస్తోంది.
Recommended Video
దక్షిణ తీరాన్ని కూడా ఆక్రమించే కుయుక్తులు...
తూర్పు లదాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఏప్రిల్ ముందువరకు ఉన్న యదాతథ స్థితిని కొనసాగించాలని భారత్ చైనాను కోరుతుండగా... చైనా మాత్రం ముందు భారత్ పాంగాంగ్ దక్షిణ తీరంలోని వ్యూహాత్మక శిఖరాలను ఖాళీ చేయాలని కోరుతున్నట్లు తాజాగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లోనూ పదేపదే ఈ షరతునే ముందుకు తెస్తున్న చైనాకు భారత్ కూడా ధీటుగా బదులిస్తోంది. భారత్ దక్షిణాన వ్యూహాత్మక శిఖరాలను ఖాళీ చేయాలంటే... అదే సమయంలో చైనా పాంగాంగ్ ఉత్తర తీరాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే పాంగాంగ్ వివాదాస్పద ఉత్తర తీరాన్ని వంచనతో ఆక్రమించుకున్న చైనా... దక్షిణ తీరాన్ని కూడా ఆక్రమించుకునే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే భారత్ అక్కడినుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది.
ఏడు చోట్ల వాస్తవాధీన రేఖను దాటిన భారత్...
పాంగాంగ్ దక్షిణ తీరాన్ని ఖాళీ చేయాలని వాదిస్తున్న చైనా పట్ల భారత్ కూడా దూకుడుగానే వ్యవహరిస్తోంది. దక్షిణ తీరంలో ఏడు చోట్ల భారత బలగాలు వాస్తవాధీన రేఖను దాటుకుని వెళ్లినట్లు చెబుతున్నారు. ఇప్పటికే దక్షిణాన వ్యూహాత్మక శిఖరాలను ఆక్రమించి.... చైనాకు చెందిన స్పాంగూర్ కనుమతో పాటు మోల్దో సైనిక స్థావరాలపై నిఘా పెట్టడం ద్వారా చైనా గుండెల్లో భారత్ రైళ్లు పరిగెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏడు చోట్ల వాస్తవాధీన రేఖను దాటుకుని వెళ్లడం ద్వారా డ్రాగన్ను మరింత బెంబేలెత్తించే ప్రయత్నం చేసింది. పాంగాంగ్ ఉత్తర తీరాన్ని ఖాళీ చేయకుండా భారత్ మాత్రం దక్షిణ తీరాన్ని ఖాళీ చేయాలన్న చైనా వితండ వాదనకు దూకుడే సరైన సమాధానమని భారత్ భావిస్తోంది.
ఒకేసారి ఇద్దరం తప్పుకుందామంటున్న భారత్...
'తాజా చర్చల్లో చైనా డిమాండ్ ఏంటంటే... భారత్ మొదట పాంగాంగ్ దక్షిణ తీరాన్ని ఖాళీ చేయాలని. అయితే ఒకేసారి రెండు దేశాలు దక్షిణ,ఉత్తర తీరాలను ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది.' అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల 7వ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల్లో దీనిపై సయోధ్య కుదరకపోవడంతో ఇరు దేశాల మధ్య త్వరలోనే 8వ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇదే అంశంపై ఇరు దేశాల రక్షణ శాఖ,విదేశాంగ మంత్రుల మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇటు చర్చలను కొనసాగిస్తేనే... అటు సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ వ్యూహాత్మకంగా సిద్దమవుతోంది.