గుజరాత్లో గెలిచేదెవరు?: డ్రాగన్ కంట్రీ డేగకన్ను, ఎందుకంటే...
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఇప్పటికే ఎగ్జిల్ పోల్స్లో వెల్లడైంది. సోమవారం ఎన్నికల సంఘం ఫలితాలను వెలువరించనుంది. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడంతో యావత్ భారతదేశం ఆసక్తి కనబరుస్తోంది.
మరోవైపు మన పొరుగు దేశమైన చైనా కూడా గుజరాత్ ఎన్నికల ఫలితాల పట్ల అంతే ఆసక్తిగా ఉంది. అంతేకాదు, గుజరాత్ ఎన్నికల గురించి చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక ప్రత్యేకమైన కథనాలను కూడా ప్రచురించింది.
గుజరాత్ ఫలితాలపై చైనా కన్ను...
గుజరాత్ ఎన్నికలను మనమే కాదు, చైనాలోని చాలా మంది పరిశీలకులు నిశితంగా పరిశీలిస్తున్నారట. ఈ మేరకు ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ రెండో దశ ఎన్నికల ముందు ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. ప్రధాని నరేంద్ర చేపడుతున్న సంస్కరణల పట్ల భారత ఓటర్లు ఎలా స్పందిస్తున్నారో గుజరాత్ ఎన్నికల ద్వారా తెలిసిపోతుందని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది.
ఆర్థిక బంధాలే కారణం...
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్తో సరిహద్దు సమస్యలే కాదు.. అంతకు మించి ఆర్థిక సంబంధాలూ చైనాకు ఉన్నాయి. పైగా ఈ సంబంధాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి కూడా. ‘మేకిన్ ఇండియా'లో భాగంగా భారత్లోకి వచ్చే చైనా పెట్టుబడులు ఏటేటా పెరుగుతున్నాయి. చైనాకు చెందిన పలు కంపెనీలు ఈ పెట్టుబడులు పెడుతున్నాయి. షియోమీ, ఒప్పో లాంటి చైనా సంస్థలు భారత్లో భారీగా వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
బీజేపీ గెలిస్తే సంస్కరణలు వేగవంతం...
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. మోడీ ప్రభుత్వం మరింత వేగంగా ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తుందని డ్రాగన్ భావిస్తోంది. అలా జరిగితే తమ దేశ కంపెనీలకు కూడా ప్రయోజనకరమనేది చైనా భావన. ఒకవేళ గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడితే మాత్రం 2019 ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉంటుందని చైనా ఆందోళన చెందుతోంది.
అధికారంలోకి వచ్చినా...
ఒకవేళ గుజరాత్లో బీజేపీ అధికారంలోకి వచ్చినా, తక్కువ సంఖ్యలో సీట్లు సాధిస్తే.. ఆర్థిక సంస్కరణల అమల్లో మోడీ సర్కారు దూకుడు కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితే తలెత్తితే సామాన్య ప్రజానీకం మద్దతు కూడగట్టేలా ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల్ని చేపట్టాలని చైనా డైలీ గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అంతేకాదు, భారత్లో వ్యాపారం చేసే చైనా కంపెనీలు దీర్ఘకాలంలో భారత ఆర్థిక విధానంలో మార్పులకు కూడా సిద్ధమై ఉండడం మంచిదని సూచించింది. ఎన్నికల ఫలితాల తర్వాత భారత మార్కెట్లో అస్థిరత తలెత్తే అవకాశం ఉందని కూడా డ్రాగన్ కంట్రీ అంచనా వేస్తోంది.