ప్రధాని అరుణాచల్ పర్యటనపై డ్రాగన్ విషం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించ తలపెట్టిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన పట్ల పొరుగు దేశం చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఆ దేశ ప్రధానమంత్రి పర్యటించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా ఛున్ యింగ్ ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్.. చైనాతో సరిహద్దులను పంచుకుంటోంది. మొత్తంగా భారత్-చైనా మధ్య 3488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లోని కొంత భూభాగాన్ని తమదిగా చెబుతూ వస్తోంది చైనా.
ఇదే విషయం చైనా-భారత్ మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నది కూడా. దీనిపై పలుమార్లు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు చోటు చేసుకున్నప్పటికీ.. అవి పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. ఈ సరిహద్దు గొడవలు తేలక ముందే ప్రధాని అరుణాచల్ ప్రదేశ్ ను సందర్శించడం సరికాదని అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ వ్యాఖ్యానించింది. మోడీ పర్యటనను తాము వ్యతిరేకిస్తున్నామని నిర్ద్వందంగా వెల్లడించింది. చైనా అధికార ప్రతినిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యానాలపై మనదేశం వెంటనే స్పందించింది. చైనా అభ్యంతరాన్ని మనదేశ విదేశాంగ మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. చైనా వ్యాఖ్యాలు అర్థరహితమని కొట్టి పారేసింది. చైనా తమదిగా చెబుతోన్న అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగం ఎప్పటికీ తమదేనని విదేశాంగ శాఖ పేర్కొంది.
ద్వైపాక్షిక చర్చల ద్వారా, సుహృద్భావ వాతావరణంలో తాము సరిహద్దు గొడవలకు పరిష్కారాన్ని కోరుకుంటున్నామని విదేశాంగ మంత్రిత్వశాఖ శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. శనివారం అసోంలో బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం ఆయన అరుణాచల్ ప్రదేశ్, త్రిపురల్లో పర్యటిస్తారు. తన అరుణాచల్ పర్యటన సందర్భంగా ప్రధాని.. హల్లొంగిలో 4000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు.