అరుణాచల్పై చైనా మరోసారి అక్కసు.. రాజ్నాథ్ పర్యటనపై విషం చిమ్మిన డ్రాగన్
డ్రాగన్ చైనా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుపై విషం చిమ్మింది. గురువారం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించడంతో ఎప్పటిలాగే పెదవి విరిచింది. చైనా వైఖరిని భారత్ ఎండగట్టింది.
రాజ్నాథ్ పర్యటన..
‘మైత్రి దివాస్ సందర్భంగా గురువారం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్లోని తావాంగ్ వెళ్లారు. సైనికులతో పౌరుల స్నేహనికి ప్రతీక మైత్రి దివాస్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ సువాంగ్ స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్లో వివాదస్థద ప్రాంతంలో పర్యటించడం సరికాదని పేర్కొన్నారు. ఆ చోట భారత్ కార్యక్రమాలను నిర్వహించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు.
అభిమతం ..
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సంబంధించి చైనా సరైన గౌరవం అందజేయాలని కోరారు. తమ అభిరుచి, అభిమతం మేరకు నడుచుకోవాలని సూచించారు. ఇలాంటి చర్యలతోనే సరిహద్దులో శాంతి స్థాపనకు దోహదపడుతామని డ్రాగన్ చైనా నీతులు చెప్పింది.
టిబెట్ అంతర్భాగమట
అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్లోని భాగమని చైనా మరోసారి నొక్కి వక్కానించింది. దీంతోపాటు సరిహద్దుకు సంబంధించి ఇరుదేశాలు 21 పర్యాయాలు చర్చలు కూడా జరిపాయనే విషయాన్ని గుర్తుచేశారు. అరుణాచల్ ప్రదేశ్తో టిబెట్ 3488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ అక్చువల్ కంట్రోల్) మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
ఇదివరకు కూడా
ఇప్పుడే కాదు గతంలో కూడా భారత నేతలు అరుణాచల్ ప్రదేశ్ వెళితే చైనా ఇలాగే స్పందించింది. అయితే అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ అంతర్భాగమని భారత్ ధీటుగానే బదులిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ఉద్రిక్తత తనకు తెలుసని గురువారం రాజ్నాథ్ సింగ్ కామెంట్ చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో వారి జీవనశైలి ఉంటుందని పేర్కొన్నారు.