చైనా తిక్క కుదిర్చే నిర్ణయం... తగ్గేది లేదంటున్న భారత్... సరిహద్దు వివాదంపై కీలక అప్డేట్...
తూర్పు లదాఖ్లోని 1597 కి.మీ పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక బలగాలను కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. తూర్పు లదాఖ్లో చైనా యధాతథ స్థితిని నెలకొల్పేంత వరకూ బలగాలను ఉపసంహరించుకోవద్దని భావిస్తున్నట్లు తెలిపాయి. ఏప్రిల్ 20కి ముందు తూర్పు లదాఖ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో... ఇప్పుడు కూడా అదే స్థితి నెలకొనాలని భారత్ పలుమార్లు చైనాతో చెప్పిందని ఆర్మీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా సాగాలంటే చైనా అక్కడినుంచి వెనక్కి తగ్గాల్సిందేనని తేల్చి చెప్తున్నాయి.
చైనాకు తెలిసొచ్చేలా...
సరిహద్దు వివాదం ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని చైనాకు తెలిసొచ్చేలా చేయాలని భావిస్తున్నట్లు ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి. సరిహద్దులో సైన్యం ఉపసంహరింపుకు,యధాతథ స్థితి నెలకొనేలా చేసేందుకు చైనా చాలా సమయం తీసుకునే అవకాశం ఉందని,అదే జరిగితే భారత్-చైనా సంబంధాలకు మరింత డ్యామేజ్ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు తూర్పు లదాఖ్లోని ఘర్షణ ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరిస్తున్నట్లు చెప్తున్నప్పటికీ... పాంగోంగ్ త్సో సరస్సు సమీపంలోని ప్యాట్రోలింగ్ పాయింట్ 17,17A వద్ద చైనా దురాక్రమణకు పాల్పడుతోందని భారత ఆర్మీ చెబుతోంది.ఫింగర్ 4 వద్ద ఇప్పటికీ తమ బలగాలను కొనసాగిస్తున్న చైనా... ఫింగర్ 3 సమీపంలోని ధన్ సింగ్ తపా పోస్టు వద్ద నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతోంది.
ఆ డాక్యుమెంట్ ఏమైనట్లు...
మరోవైపు చైనా దురాక్రమణకు సంబంధించి భారత రక్షణ శాఖ వెబ్ సైట్లో కీలక డాక్యుమెంట్ కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.'వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణలు పెరిగిపోతున్నాయి. మే 5,2020 నుంచి గాల్వన్ వ్యాలీలో చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. కున్గ్రాంగ్,నాలా,గోగ్రా,పాంగోంగ్ సరస్సు ప్రాంతాల్లో మే 17,18 తేదీల్లో చైనా దురాక్రమణలకు పాల్పడింది.' అని ఆ డాక్యుమెంట్లో పేర్కొన్నారు. అయితే ఈ డాక్యుమెంట్ ఎలా మిస్సయిందో కానీ ఇప్పుడైతే రక్షణ శాఖ సైట్లో కనిపించట్లేదు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు.
Recommended Video
జూన్ 15 నుంచి...
జూన్ 15వ తేదీ భారత్-చైనా జవాన్ల మధ్య తలెత్తిన ఘర్షణలో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్దం వస్తుందా అన్న రీతిలో పరిణామాలు కనిపించాయి. అయితే ఇరు దేశాలు మిలటరీ స్థాయిలో చర్చలు జరుపుతూ తూర్పు లదాఖ్లోని ఘర్షణ ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గేందుకు ఒక అవగాహనకు వచ్చాయి. కానీ చైనా మాత్రం పైకి సైన్యం ఉపసంహరణ చేపడుతున్నామని చెప్తున్నా... గ్రౌండ్లో ఇప్పటికీ డ్రాగన్ బలగాలు ఉన్నాయన్న కథనాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠను రేపుతోంది.