అరుణాచల్ ప్రదేశ్లో అమిత్ షా పర్యటనపై చైనా తీవ్ర అభ్యంతరం..ఎందుకంటే..?
అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్ ప్రాంతంలోకి వస్తుందని మొదటి నుంచి వాదిస్తున్న చైనా... తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు రాకూడదని గట్టిగా చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్కు వచ్చారు. అమిత్ షా పర్యటనకు చైనా అభ్యంతరం తెలిపింది. భారత్ రాజకీయంగా పరస్పర అవగాహన లేదా నమ్మకాన్ని వమ్ము చేసిందని డ్రాగన్ కంట్రీ మండిపడింది.
అరుణాచల్ ప్రదేశ్ 34వ రాష్ట్రఅవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్కు వెళ్లారు. ఇక ఇలా ఒక మంత్రిని లేదా నాయకుడిని చైనా అరుణాచల్ ప్రదేశ్కు రాకుండా అడ్డుకోవడం తొలిసారి కాదు. అంతకుముందు కూడా రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటనపై కూడా అభ్యంతరం తెలిపింది చైనా. చైనా-భారత్ల తూర్పు సెక్టార్ సరిహద్దు లేదా దక్షిణ టిబెట్ ప్రాంతంయొక్క సరిహద్దులపై స్పష్టత ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం ఉందన్న విషయాన్ని చైనా ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదని ఆయన అన్నారు. అందుకే ఆ ప్రాంతంలో పర్యటించే భారత దేశ నాయకులకు అభ్యంతరం తెలుపుతున్నామని చెప్పారు.
Recommended Video
సరిహద్దు విషయంలో భారత్ తదుపరి చర్యలకు ఉపక్రమించరాదని చైనా హెచ్చరించింది. ఇలాంటి చర్యలు తీసుకుని సమస్యను జటిలంగా మార్చవద్దని హితవు పలికింది. సరిహద్దులో శాంతి నెలకొనేందుకు ప్రయత్నించాలని చైనా భారత్ను కోరింది. ఇక భారత్ చైనా సరిహద్దు వివాదం దాదాపు 3,488 కిలోమీటర్లు మేరా ఉంది. ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పరిధిలోకి వస్తుంది. ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమైన దక్షిణ టిబెట్ పరిధిలోకి వస్తుందనే వాదన గత కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటి వరకు 22 సార్లు రెండు దేశాల మధ్య ప్రత్యేక చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 20వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి వేరుపడి పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరించింది.