భారత్పై చైనా వాటర్ బాంబ్... అదే జరిగితే తీరని నష్టం.. డ్రాగన్తో మరో డేంజర్...
ఓవైపు ఏడు నెలలుగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదం... ఈ వివాదం ఇంకా సద్దుమణగకముందే భారత్-చైనా మధ్య మరో కొత్త వివాదం వచ్చి చేరింది. భారత్ గుండా ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్(హైడ్రో పవర్) ప్రాజెక్టును నిర్మిస్తామని ఈ ఏడాది నవంబర్ 30న చైనా చేసిన ప్రకటన తాజా వివాదానికి ఆజ్యం పోసింది. పొరుగు దేశాలతో కనీస మాత్రంగానైనా సంప్రదింపులు జరపకుండా చైనా తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంతో భారత్,బంగ్లాదేశ్,భూటాన్ తీవ్రంగా నష్టపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Recommended Video
ఆ పాయింట్ వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్...
చైనాలో బ్రహ్మపుత్ర నదిని 'యర్లుంగ్ జంగ్బో' అని పిలుస్తారు. ఇదే నదిని టిబెట్లో 'యర్లుంగ్ త్సంగ్పో' అని పిలుస్తారు. హిమాలయ పర్వతాల నుంచి ఉధ్భవించే ఈ నది భారత్,టిబెట్,చైనా,బంగ్లాదేశ్ల గుండా ప్రవహిస్తుంది. టిబెట్లోని గ్రేట్ బెండ్ ప్రాంతం వద్ద ఈ నది భారత్ వైపు మళ్లుతుంది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు ఇది కేవలం 40కి.మీ దూరంలో ఉంది. 2755మీ. ఎత్తు ఉండే ఈ పాయింట్ వద్ద ప్రాజెక్టును నిర్మించడం ద్వారా... ఏడాదికి 200 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని చైనాకు తరలించుకుపోవాలని ఆ దేశం భావిస్తోంది. ఈ నీటితో నైరుతి చైనా మొత్తానికి సరిపడే విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చునని భావిస్తోంది.
భారత్పై వాటర్ బాంబ్...
నిజానికి చాలా ఏళ్లుగా చైనా బ్రహ్మపుత్ర నదిపై హైడ్రో పవర్ ప్రాజెక్టును నిర్మించాలని భావిస్తోంది. ఇప్పుడు కూడా భారత్ శాటిలైట్ చిత్రాలను బయటపెట్టడంతో డ్రాగన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ధ్రువీకరించింది. అంతేకాదు,చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెబ్సైట్లలో భారత్పై ఇది తమ దేశం సంధిస్తున్న 'వాటర్ బాంబ్'గా పేర్కొనడం గమనార్హం. ఇలాంటి ప్రాజెక్టు చరిత్రలో ఇంతవరకూ లేదని.. దీని ద్వారా గంటకు 70మిలియన్ల కిలోవాట్ విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చునని పవర్ కన్స్ట్రక్షన్ కార్పోరేషన్ ఆఫ్ చైనా చైర్మన్ యాజ్ జియోంగ్ పేర్కొన్నట్లు
చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
భారత్కు తీరని నష్టం...
ఈ ప్రాజెక్టుతో భారత్కు రావాల్సిన బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని చైనా మళ్లించుకుపోతే ఇండో-గంగా మైదానంలోని ప్రజలకు తీరని నష్టం జరగనుంది. కరువు కాటకాలతో దాదాపు 40 కోట్ల మంది ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటారు. బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని చైనా నియంత్రించడం తమపై వాటర్ను కూడా వెపన్లా ఉపయోగించడమేనని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు నీటిని వదలకుండా కరువులు సృష్టించడం... భారీ వరదల సమయంలో వాటిని దిగువకు వదిలి ఈశాన్య రాష్ట్రాలను ముంపుకు గురిచేసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతోంది.
భారత్ కౌంటర్ ప్రాజెక్ట్...
చైనాకు కౌంటర్గా బ్రహ్మపుత్ర నదిపై తాము కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తామని భారత్ ప్రకటించింది. ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన రెండు దేశాలు ఇలా పోటాపోటీగా ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంటే పరిస్థితులు అదుపు తప్పుతాయన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే భారత్-చైనా సరిహద్దు ప్రతిష్ఠంభనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతుండగా.. ఇక ఈ ప్రాజెక్టు విషయంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్టుతో దిగువన ఉన్న రాష్ట్రాలకు ఎటువంటి హానీ కలిగించే చర్యలు చేపట్టమని చైనా చెప్తున్నప్పటికీ భారత్ గత అనుభవాలు డ్రాగన్ మాటలను విశ్వాసంలోకి తీసుకునే అవకాశం లేదు.