చైనా అభ్యంతరం.. అయినా ఆగని నిర్మలా సీతారామన్!
కేంద్ర రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ అరుణాచల్ప్రదేశ్ పర్యటనపైనా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా మన రక్షణ మంత్రి వెనకడుగు వేయలేదు. అరుణాచల్ ప్రదేశ్ అంజ్యా జిల్లాలోని కిబుతు సైనిక స్థావరాన్ని
బీజింగ్: చైనా ఇంకా మారలేదు. ప్రతిదీనికీ అభ్యంతరం వ్యక్తం చేసే తన బుద్ధిని అది ఇప్పటికీ మార్చుకోలేదు. తాజాగా కేంద్ర రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ అరుణాచల్ప్రదేశ్ పర్యటనపైనా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయినా మన రక్షణ మంత్రి వెనకడుగు వేయలేదు. అరుణాచల్ ప్రదేశ్ అంజ్యా జిల్లాలోని కిబుతు సైనిక స్థావరాన్ని ఆదివారం నిర్మలా సీతారామన్ సందర్శించారు. ఈ సైనిక స్థావరం చైనా సరిహద్దు వెంబడి ఉండడంతో అలవాటు ప్రకారమే ఆ దేశం అభ్యంతరం తెలిపింది.
భారత్, చైనా మధ్య అరుణాచల్ప్రదేశ్ విషయమై గతకొంతకాలంగా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. అరుణాచల్ దక్షిణ టిబెట్లో భాగమే అని చైనా వాదన. దీంతో భారత్ నుంచి ఉన్నతాధికారులు ఎవరైనా అక్కడ పర్యటిస్తే చైనా పదే పదే తప్పుబడుతూ వస్తోంది.
తాజాగా రక్షణమంత్రి పర్యటనపై కూడా చైనా విదేశాంగశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ వివాదాస్పద ప్రాంతమని, ఇలాంటి పర్యటనలు అక్కడి శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తాయని చైనా ఆరోపించింది.
'అరుణాచల్ప్రదేశ్లో భారత రక్షణమంత్రి పర్యటన అంటే.. అక్కడ చైనా స్థానమేంటో మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. భారత్-చైనా సరిహద్దు తూర్పు ప్రాంతంపై ఇరు దేశాల మధ్య వివాదం జరుగుతోంది. ఇలాంటి సమయంలో భారత్ నుంచి ఓ మంత్రి అక్కడ పర్యటిస్తే.. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది..' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునియింగ్ అన్నారు. అంతేకాదు, 'వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ చైనాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నాం..' అని కూడా పేర్కొన్నారు.