PoK సరిహద్దులో చైనా అతిపెద్ద, ఎత్తైన విమానాశ్రయం: ఆందోళనలో భారత్
న్యూఢిల్లీ: భారత్కు పొరుగు దేశాలైన పాకిస్ధాన్, శ్రీలంకతో చైనా తన మైత్రిని బలోపేతం చేసుకుంటుంది. పొరుగు దేశాలతో చైనా మైత్రి భారత్లో కొంత ఆందోళనను కూడా పెంచుతుంది. గతంలో శ్రీలంకలోని నౌకశ్రయాన్ని ఉపయోగించుకున్న చైనా, తాజాగా పాకిస్ధాన్ ఆధీనంలోని కాశ్మీర్ సరిహద్దులో ఏకంగా విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది.
చైనా సివిల్ ఏవియేషన్ అధికారల సమాచారం ప్రకారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న జిన్జియాంగ్ ప్రావెన్స్లోని తస్కుర్గన్ ప్రాంతంలో ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విమానాశ్రయం సముద్ర మట్టానికి 2,480 అడుగుల ఎత్తులో ఉండబోతోంది.
గత వారంలో చైనాకు చెందిన సివిల్ ఏవియేషన్ ఇంజనీరింగ్ కన్సల్టింగ్ కంపెనీ అధికారులు జిన్జియాంగ్ను సందర్శించి, ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టనున్న స్ధలాన్ని ఖరారు చేశారు. ఈ విమానాశ్రయం సముద్ర మట్టానికంటే 3,200 మీటర్ల ఎత్తులో ఉండబోతోందని జిన్జియాంగ్ ఏవియేషన్ అథారిటీ తెలిపినట్లు చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ జిన్హువా తన కథనంలో పేర్కొంది.
గతంలో చైనా సముద్ర మట్టానికి ఎత్తులో చాలా విమానాశ్రయాలను నిర్మించింది. అయితే అవన్నీ కూడా ఈ విమానాశ్రయం కంటే తక్కువ ఎత్తులో ఉండటం విశేషం. ఈ విమానాశ్రయం ఏర్పాటుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చైనా తన నిర్మాణాలను శాశ్వతం చేసుకునేందుకే ఈ చర్యలు చేపడుతోందని భారత్ ఆందోళన చెందుతుంది.
అయితే ఈ విషయంపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని చైనా అసిస్టెంట్ విదేశాంగ శాఖ మంత్రి లియు జినచావో పేర్కొన్నారు. జిన్జియాంగ్ ప్రావెన్స్లోని తస్కుర్గన్ పట్టణం కారాకోరమ్ హైవేకు సమీపంలో ఉన్న ఒక చిన్న పట్టణం. ఈ పట్టణ జనాభా యాభైవేలకు లోపే ఉంటుంది.
చైనా త్వరలో పశ్చిమాన ఉన్న కష్గర్ ప్రాంతం నుంచి పాకిస్ధాన్ తీర ప్రాంతమైన గ్వాదర్ వరకు మల్టీబిలియన్ డాలక్ ఎకనమిక్ కారిడార్ నిర్మించాలనే ప్రతిపాదనలో తస్కుర్గన్ పట్టణం కీలక పాత్ర పోషించనుంది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సోమవారం పాకిస్ధాన్లో పర్యటించి, ఇరు దేశాల మధ్య కుదిరిన ముఖ్యమైన ఒప్పందంలో ఎకనమిక్ కారిడార్ ఒకటి.