ఎంత చెప్పినా మార్పులేదు: పాక్, చైనాలకు ఎస్సీవో వేదికగా ప్రధాని మోడీ చురకలు
న్యూఢిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతలకు కారణమవుతున్న పాకిస్థాన్, చైనాలకు అంతర్జాతీయ వేదికపై హెచ్చరికలు చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో)లోని సభ్య దేశాలన్నీ పరస్సరం గౌరవించుకోవాలని ప్రధాని హితవు పలికారు. మంగళవారం జరిగిన ఎస్సీవో శిఖరాగ్ర సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేశారు.
వర్చువల్గా జరిగిన ఈ 20వ సమావేశానికి 8 మంది సభ్యదేశాలు హాజరుకాగా, ప్రధాని మోడీ సభ్య దేశాలను ఉద్దేశించి, ముఖ్యంగా పాకిస్థాన్, చైనాలను ఉద్దేశించి హిత వ్యాఖ్యలు చేశారు. ఎస్సీవో దేశాల మధ్య సంబంధాల్ని బలోపేతం చేయడానికి భారత్ ఎంతో కృషి చేస్తోందని తెలిపారు.
దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి వారి సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం ముఖ్యమన్నారు. అంతేగాక, కొన్ని దేశాలు ఎస్సీవో ఏర్పాటు చేసిన సూత్రాలకు వ్యతిరేకంగా ద్వైపాక్షిక సమస్యలను పదే పదే లేవనెత్తుతున్నాయన్నారు. ఇది ఎంతో దురదృష్టకరమని పాక్, చైనాలకు ప్రధాని మోడీ చురకలంటించారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్లు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అధ్యత వహించారు.
'ఐక్యరాజ్యసమితి తన 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ అనేక విజయాలు ఉన్నప్పటికీ, ఐక్యరాజ్యసమితి ప్రాథమిక లక్ష్యం ఇప్పటికీ అసంపూర్ణంగా ఉంది. అంటువ్యాధి యొక్క ఆర్ధిక, సామాజిక బాధలతో పోరాడుతున్న ప్రపంచం యూఎన్ వ్యవస్థలో సమూలమైన మార్పులను తీసుకువస్తుందని భావిస్తున్నారు' అని ప్రధాని తెలిపారు.
Recommended Video
కాగా, కరోనా మహమ్మారిపై పోరాటంలో మొత్తం మానవాళికి సాయపడటానికి, టీకా తయారీ, పంపిణీకి భారత్ తన శాయశక్తులా కృషి చేస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో భారత ఫార్మా రంగం దాదాపు 150 దేశాలకు మందులను సరఫరా చేసిందని మోడీ వివరించారు.