చైనా మైండ్గేమ్..ఆర్ట్ ఆఫ్ వార్: బోర్డర్లో లౌడ్ స్పీకర్లు.. పంజాబీ పాటలు: చెవులు చిల్లులు పడేలా
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనిక బలగాలు మరోసారి తెంపరితనాన్ని ప్రదర్శించాయి. భారత జవాన్లను రెచ్చగొట్టే ప్రయత్నానికి దిగాయి. కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. భారత జవాన్ల ఏకాగ్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. మొన్నటికి మొన్నే వార్నింగ్ షాట్ ఫైరింగ్కు పాల్పడిన చైనా బలగాలు.. ఈ సారి తమ రూటును మార్చాయి. వాస్తవాధీన రేఖ వెంబడి కంటి మీద కునుకు లేకుండా పహారా కాస్తోన్న జవాన్లపై మైండ్గేమ్ను ఆరంభించాయి.
Recommended Video
లఢక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు: తిప్పి కొడతాం: వ్యూహాత్మకంగా
లౌడ్ స్పీకర్లు.. పంజాబీ పాటలు
వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పాంగ్యాంగ్ త్సొ సరస్సు దక్షిణ ప్రాంతం, ఫింగర్-4, మోల్డో గ్యారిసన్, ఛుసుల్ సెక్టార్ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లను అమర్చారు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు. పంజాబీ పాటలను వినిపిస్తున్నారు. నెగెటివ్ వైబ్రేషన్స్ కలిగించే పంజాబీ పాటలను ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. 1990 దశాబ్దం నాటి పాత పంజాబీ పాటలను చైనా సైనికులు వినిపిస్తున్నారని, రౌండ్ ద క్లాక్ తరహాలో వాటిని ప్లే చేస్తున్నారని జాతీయ వార్తాసంస్థ వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఆర్ట్ ఆఫ్ వార్గా
చైనా సైనికుల తాజా చర్యను ఆర్ట్ ఆఫ్ వార్గా అభివర్ణిస్తున్నారు. తమ శతృవును మానసికంగా దెబ్బకొట్టడానికి, అశాంతికి గురి చేయడానికి ఇలా చిట్కాలను ప్రయోగిస్తుంటారని పేర్కొంటున్నారు. చైనా మిలటరీ వ్యూహకర్త సున్ ట్జు రాసిన ఆర్ట్ ఆఫ్ వార్ పుస్తకంలోని ట్రిక్ను ఈ సందర్భంగా రెడ్ ఆర్మీ ఉపయోగిస్తోందని చెరబుతున్నారు. ఆరవ శతాబ్దంలో రాసిన పుస్తకం ఇది. ఎలాంటి యుద్ధానికీ దిగకుండా శతృవుపై మానసికంగా పైచేయి సాధించడానికి చైనా ప్రయత్నాలను చేపట్టిందని ఆ దేశానికి చెందిన మీడియా కూడా వెల్లడించింది.
సైకలాజికల్ వార్ఫేర్
ఇలాంటి సైకలాజికల్ వార్కు దిగడం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి కొత్తేమీ కాదనీ అంటున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇలా శతృవును రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుంటుందని, అదే విధానాన్ని ప్రస్తుతం అమలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కిందటి నెల 29, 30 తేదీల్లో వార్నింగ్ షాట్ ఫైరింగ్కు పాల్పడిన తరువాత, ఒకట్రెండు భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతాలను భారత జవాన్లు స్వాధీనం చేసుకోవడంతో చైనా సైనికులు లౌడ్ స్పీకర్లతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
భారత జవాన్లపై అక్కసు ప్రదర్శిస్తోన్న చైనా..
ప్యాంగ్యాంగ్ త్సొ సరస్సు దక్షిణ ప్రాంతంలోని రెజంగ్ లా-రెచిన్ లా రిడ్జ్లైన్ ప్రాంతాల్లో భారత జవాన్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీనితో చైనా తన వ్యూహాన్ని మార్చిందని, యుద్ధ చేయకుండా ప్రత్యర్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా, వారిపై పైచేయి సాధించేలా ఆర్ట్ ఆఫ్ వార్ ట్రిక్స్ను ప్రయోగిస్తోందని అంటున్నారు. యుద్ధం చేయకుండానే శతృవువును దెబ్బతీయడం అనే ఈ కళను ఇదివరకు 1962 భారత్పైనే ప్రయోగించిందని. అదే రణతంత్రాన్ని మరోసారి ప్రదర్శిస్తోందని జాతీయ వార్తాసంస్థ పేర్కొంది.
కమ్యూనిజం భావజాలంతోనూ
కమ్యూనిజం భావజాలంతో కూడుకున్న రెచ్చగొట్టే విధానాలను చైనా తరచూ అనుసరిస్తుంటుందని, తాజాగా సరిహద్దుల్లో అదే వ్యూహంతో భారత జవాన్లపై మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నాలకు తెర తీసిందని వెల్లడించింది. గడ్డకట్టుకు పోయే చలికాలంలో, అత్యంత ప్రతికూల వాతావరణంలో తమ దేశ జవాన్లను భారత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదంటూ ఇదివరకే చైనా జాతీయ మీడియా కథనాలను వండి వార్చింది. సరైన ఆహారం, రవాణా సౌకర్యాలను కల్పించట్లేదని, చలిని తట్టుకునే టెంట్లు కూడా భారత సైన్యానికి లేవంటూ తన అక్కసును వెల్లబోసుకుంటోంది.